‘రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం’

by  |
‘రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం’
X

దిశ, మహబూబ్‌నగర్: ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పేదలను, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. టీ-పీసీసీ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఒక రోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అలంపూర్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం అసలు కరోనా టెస్టులు చేయకుండా కేసులు తగ్గాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల నుంచి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన కేసీఆర్.. నేడు మిల్లర్లకు అప్పగించారని విమర్శించారు. తరుగు పేరుతో ఇష్టానుసారంగా రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వలస కార్మికులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

సూర్యాపేటలోనూ..

సూర్యాపేటలోనూ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కోనుగోలు చేయాలనీ, తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల చొప్పున నగదు రూపంలో అందించాలని డిమాండ్ చేశారు. కరోనా టెస్ట్‌ల విషయంలో ఎన్ని టెస్ట్‌లు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు.

Tags: AICC, secretary, sampath, protest, alampur, mahabubnagar, ts, Suryapet, cheviti venkanna


Next Story