రైతులను వాహనాలతో తొక్కించి చంపితే ప్రధాని ఏం చేశాడు

by  |
Congress leader Ponnala Lakshmaiah
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి వంద అంటే ఇష్టం ఉన్నట్లుంది, అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో ఆ పనిచేస్తా, ఈ పనిచేస్తా అని ఇంతవరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇష్టానుసారంగా ప్రజలపై భారాలు మోపుతూ పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా రైతులను వాహనాలతో తొక్కించి చంపుతుంటే ప్రధాని మోడీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో వందకోట్ల వ్యాక్సిన్‌ డోసులు వేసినట్లు ప్రచారం చేస్తున్నారు కానీ, 106 దేశాలు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశాయని గుర్తుచేశారు. ఇతర దేశాల్లో వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు లేకున్నా పూర్తి చేశాయని, మన దగ్గరే వ్యాక్సిన్ తయారవుతున్నా నేటికీ పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నామని మండిపడ్డారు. మోడీకి వంతపాడిన ఘనత కేసీఆర్‌కే చెందుతుందని ఎద్దేవా చేశారు.

పారాసిటమాల్‌, మాస్క్‌ అవసరం లేదని, కరోనా తెలంగాణలో రాదని చెప్పిన ప్రజాద్రోహి కేసీఆర్ అని ఆగ్రహించారు. మోడీ అక్రమ కేసులు పెడుతాడేమో అని కేసీఆర్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మోడీ, కేసీఆర్‌లు అబద్ధాలు చెప్పటంలో దిట్ట అని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక పనులు చేశామన్నారు. మలేరియాను నిర్మూలించిన ఘనత కాంగ్రెస్‌‌దే అని కొనియాడారు.


Next Story

Most Viewed