అమిత్ షా సభకు అనుమతివ్వొద్దు : నిరంజన్

by  |
అమిత్ షా సభకు అనుమతివ్వొద్దు : నిరంజన్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించనున్న సీఏఏ అవగాహనా సభకు అనుమతి ఇవ్వొద్దని టీపీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ… ప్రజలు బీజేపీకీ అధికారం ఇచ్చింది కక్ష్య సాధింపు చర్యలకు కాదని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ పర్యటన సమయంలోనే దేశ ప్రతిష్టకు తలవంపులు తెచ్చేలా ఢిల్లీలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నయన్నారు. పౌరసత్వ చట్టంలో మతపరమైన వివక్ష చూపడం ప్రజలను ఆందోళనకు, అభద్రతకు గురిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు ప్రధాని మోడీ, అమిత్ షాలే బాధ్యులన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల పట్ల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థను అప్రమత్తంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అమిత్ షా వ్యవహారశైలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీల ప్రకటనలు హైదరాబాద్ నగర ప్రశాంతతను భగ్నం చేసే విధంగా ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలకు కారకుడైన అమిత్ షా హైదరాబాద్ నగరంలో మార్చి 15న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు అనుమతి ఇవ్వొద్దన్నారు. నగర పోలీస్ కమిషనర్ కూడా ఈ సమావేశానికి అనుమతి ఇచ్చి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు.

Next Story