కాళేశ్వరం పనుల్లో భారీ అవినీతి: నాగం

by  |
కాళేశ్వరం పనుల్లో భారీ అవినీతి: నాగం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీ అవినీతి జరిగిందని, కానీ ప్రభుత్వం, అధికారులు తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత నాగం జనార్థన్​రెడ్డి విమర్శించారు. పలు అంశాలపై ఆర్టీఐ నివేదికలతో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అక్రమానికి ఇరిగేషన్​ ఇంజినీర్లు, రిటైర్డ్​ ఇంజినీర్లు వత్తాసు పలుకుతూ తప్పుడు స్టేట్​మెంట్లు ఇస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 6,8,10, 11 లిప్ట్​ ప్యాకేజీలకు సంబంధించిన ఈఅండ్​ఎం, పంపులు, మోటార్ల పనుల్లో అవినీతి జరిగినట్లు తేలిందని, దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించినట్లు వెల్లడించారు. ఈ నాలుగు ప్యాకేజీల్లో కేవలం రూ. 1686.59 కోట్ల పనులు చేస్తే అగ్రిమెంట్​ వాల్యూగా రూ. 7,348.81 కోట్లు చూపించి బిల్లులు చేసుకున్నారన్నారు.

అగ్రిమెంట్​ ధరలు, వాస్తవ ధరలకు మధ్య రూ. 5662.22 కోట్ల వ్యత్యాసం ఉందని, ఇది కచ్చితంగా అవినీతేనన్నారు. బీహెచ్​ఈఎల్​ నుంచి ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం ప్యాకేజీ 6లో అగ్రిమెంట్​ ప్రకారం రూ. 2,251.25 కోట్లు ఉందని, కానీ బీహెచ్​ఈఎల్​ నుంచి మోటర్లకు రూ. 530.92 కోట్లు మాత్రమే ఉందని, ప్యాకేజీ 8లో అగ్రిమెంట్​ విలువ రూ. 2548.07 కోట్లు ఉందని, బీహెచ్​ఈఎల్​ నుంచి రూ. 52.15 కోట్లు ఉందని, ప్యాకేజీ 10లో అగ్రిమెంట్​ వాల్యూ రూ. 1117.84 కోట్లు చూపించారని, బీహెచ్​ఈఎల్​ సరఫరాలో మాత్రం రూ. 305.72 కోట్లు ఉందని, ప్యాకేజీ 11లో రూ. 1431.65 కోట్ల అగ్రిమెంట్​ ఉంటే బీహెచ్​ఈఎల్​ మాత్రం 320.80 కోట్లు చూపించినట్లు వివరించారు. కేవలం ఈ నాలుగు ప్యాకేజీల్లోనే పంపులు, మోటార్ల కొనుగోళ్లలో రూ. 5వేలకుపైగా అవినీతి జరిగిందని స్పష్టం కనిపిస్తుందని, కానీ ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకుంటున్న ఇంజినీర్లు అవినీతి జరుగులేదనడం బుకాయిస్తున్నారని నాగం ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని నాగం సవాల్​ విసిరారు.

Next Story

Most Viewed