అసెంబ్లీనా.. పార్లమెంటా.. మధుయాష్కీ మదిలో ఏముంది?

by  |
madhuyash-ki
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : నిన్న, మొన్నటివరకు మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా గళం విప్పుతున్నారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం తెచ్చిందనే కారణంగా టీఆర్ఎస్ జిల్లాలో బలపడిందనే టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో రెండు స్ధానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. మరో రెండు చోట్ల అత్యల్ప మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచింది. మరో నాలుగు స్థానాల్లో తగిన స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. అయితే, హస్తం పార్టీ రంగారెడ్డి జిల్లాలో బలంగా ఉందని ఆ పార్టీ క్యాడర్ నమ్ముతుంది. కానీ, నాయకత్వ లేమితోనే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేజారిపోతున్నారని అధినాయకత్వం గ్రహించింది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగానున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారడంతో క్యాడర్లో నమ్మకం సడలింది. అనేక మంది కాంగ్రెస్ పార్టీలోని సెకండ్ క్యాడర్ పార్టీలు మారేందుకు ససేమీర అంటున్నారు.

ఈ విషయాన్ని గమనించిన అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. ఇటు నేతలకు, అటు కార్యకర్తలకు అండగా నిలబడే నాయకత్వం లేకపోవడంతో క్యాడర్ చెల్లాచెదురుగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం బాధ్యతలు తీసుకోవడంతోనే రంగారెడ్డి జిల్లాపై అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మధుయాష్కీ జిల్లాలో కాంగ్రెస్ తరపున గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన మంత్రి, ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మాట్లాడటం చూశాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంధన ధరల పెంపును నిరసిస్తూ చేపట్టిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలను మంత్రి నియోజకవర్గమైన మహేశ్వరంలోని కందుకూర్ మండలంలోనే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుయాష్కీ హాజరై ప్రసంగించడంతో జిల్లాలోని అన్ని పార్టీల నేతల దృష్టి కాంగ్రెస్ పై పడింది. ఇప్పటికే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి పరువునష్టం దావా కింద నోటీసులు జారీ చేశారు. దీనంతటికీ కారణం మధుయాష్కీనే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి మధుయాష్కీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక ఫోకస్..

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రచార చైర్మన్ మధుయాష్కీ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్. ఈ జిల్లా నుండే వచ్చే ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నారా..? లేకపోతే తన జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నారా..? అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఏదీఏమైనా రాష్ట్ర రాజధానికి అత్యంత దగ్గరగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే మధుయాష్కీ రంగంలోకి దిగినట్లు ప్రతిపక్ష నేతలు చర్చించుకుంటున్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుతో పాటు మంచి క్యాడర్ ఉంది. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలకు తామున్నామనే భరోసా కల్పించేందుకు మధుయాష్కీ, కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి సోదరుల సహాయంతో జిల్లా అంతటా తిరిగేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మధుయాష్కీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెట్రోల్, డీజిల్ పెంపునకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున క్యాడర్ తరలిరావడంతో పార్టీలో నూతనోత్తేజం కనిపిస్తోంది.

అసెంబ్లీకా.. పార్లమెంటుకా..

వచ్చే సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంట్ నుండి పోటీ చేయాలా..? అనే ఆలోచనలో మధుయాష్కీ ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసినప్పటికీ చివరి వరకు ఏ పార్లమెంట్ నుంచి పోటీకి దింపుతారో తెలియని పరిస్థితి. ఆయన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నది. అయితే, భువనగిరి పార్లమెంట్ నుండే పోటీకి దిగుతారనే ప్రచారం సాగింది. కానీ చివరి క్షణంలో నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు సమాలోచనలతో ఒకరు నల్లగొండ, మరొకరు భువనగిరి పార్లమెంట్ నుండి బరిలో నిలవడం జరిగింది. దీంతో తిరిగి మధుయాష్కీని నిజామాబాద్ నుంచి బరిలో నిలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడి నుంచి తనను బరిలోకి దింపుతుందో తెలియక చివరివరకు అయోమయంలో ఉన్నారు మధుయాష్కీ. ఇప్పటి నుంచైనా పోటీ చేయాలనుకునే నియోజకవర్గం ఎంచుకుని నిత్యం ప్రజల్లో ఉండేందుకు మధుయాష్కీ ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్‌పై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Next Story

Most Viewed