ఆనాడు వద్దని.. ఇప్పుడు అమ్ముతామంటారా.. ఇదెక్కడి న్యాయం : దాసోజు

by  |
dasoju-sravan 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జల్సాల కోసమే భూములను అమ్మకానికి పెట్టారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​అన్నారు. ప్రభుత్వానికి కనిపించకుండా ఉండేందుకు సొంత ఆస్తులను కూడా కనపడకుండా దాచుకోవాలంటూ ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం కాంగ్రెస్​పార్టీ ఫిషర్‌మెన్​విభాగం ఛైర్మన్​మెట్టు సాయికుమార్‌తో కలిసి శ్రవణ్​మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సంపదకు ప్రభుత్వాలు ట్రస్టీలు మాత్రమేనని, ఓనర్లు కాదని.. ఆస్తులను కాపాడాలి కానీ అమ్ముకోవద్దని సూచించారు. ప్రభుత్వం జల్సాల కోసమే ఆస్తులను తెగనమ్ముతున్నారని మండిపడ్డారు. స్వరాష్ట్రంగా ఏర్పాటైన సమయంలో తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా ఉందని, 30 శాతం ఆదాయం హైదరాబాద్​నుంచే ఉందని శ్రవణ్​ వివరించారు. అప్పటివరకు రాష్ట్రంలో రూ.60వేల కోట్ల అప్పు ఉండేదని కానీ, నేడు అది రూ. 4 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. 60 ఏండ్ల కాంగ్రెస్​పాలనలో రూ.60 వేల కోట్లు ఉంటే, ఏడేండ్ల టీఆర్‌ఎస్​ పాలనలో రూ.4 లక్షల కోట్లు అప్పు ఏర్పడిందని మండిపడ్డారు.

2012లో అప్పటి సీఎం కిరణ్​కుమార్​రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను అమ్ముతుంటే టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్‌తో కలిసి తాము ఆందోళనలకు దిగామని, నాడు భూములు అమ్మవద్దంటూ ఉద్యమం చేసిన టీఆర్‌ఎస్​అధికారంలోకి వచ్చాక సర్కారు భూములను ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు. అప్పుడు అమ్మవద్దని ఉద్యమం చేసి తప్పు చేసినట్లు చెంపలు వేసుకోవాలని శ్రవణ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్​ హయాంలో భూములు ఎందుకు అమ్మారని మంత్రి హరీశ్​రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్​ హయాంలో ఉమ్మడి ఏపీలో 50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచామని గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఐటీ ఎక్స్‌పోర్ట్స్​భారీగా పెరిగాయని చెబుతున్నారని జీఎస్టీ, పెట్రోల్, లిక్కర్, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుందని గుర్తుచేశారు. ఈ ఆదాయం మొత్తం ఎటు పోతోంది. ఈ ఏడేండ్లలో రూ. 14 లక్షల కోట్ల ఆదాయం, రూ. 4 లక్షల కోట్ల అప్పులు కలిపి రూ. 18 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కనీస ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఎలా పాలిస్తున్నారని, దేశంలో ఉన్న ఒక చిన్న ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్.. ఇవ్వాళ దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీగా ఎలా అయిందని మండిపడ్డారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ వందల కోట్ల చందాలు ఎలా ఇచ్చిందని శ్రవణ్​నిలదీశారు. దేశంలోనే ధనిక కుటుంబంగా కల్వకుంట్ల కుటుంబం ఎదిగిందని, టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలకు కూడా వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు వచ్చాయని, వేలాది ఫీట్లలో బంగళాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.



Next Story

Most Viewed