విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారు !

by  |
విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌ను కాంగ్రెస్ పార్టీ విశ్వనగరంగా తీర్చిదిద్దితే ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం విషాద నగరంగా మార్చేసిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన బురదే కనిపిస్తుందని, ఇళ్లన్ని నీట మునిగాయని, ఓపెన్ నాలాల్లో నీళ్ళతో పాటు ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రభుత్వం అవసరమైన నిధులు ఖర్చు చేయలేదని, కిలోమీటర్ల కొద్ది ఓపెన్ నాలాలు ఉన్నా, కనీసం వాటిని మూసివేయాలని, పెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న సోయి లేకుండా పోయిందన్నారు. ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు చేసి జీహెచ్ఎంసీని అప్పులు పాలు చేశారని మండిపడ్డారు.

లక్షలాది మంది రైతులకు పంట నష్టం జరిగి దిక్కు తోచని స్థితిలో ఉంటే, కేసీఆర్ మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పక్క రాష్ట్ర సీఎం జగన్మోహన్‌రెడ్డి వర్షాలపై రివ్యూ చేస్తుంటే సీఎం కేసీఆర్ చెట్ల మీద రివ్యూ (హరితహారం) చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్ రోడ్లని గుంతల రోడ్లుగా మార్చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. నిధులను దుర్వినియోగం చేసి ఇప్పుడు సిగ్గులేకుండా మళ్ళీ మేము గెలుస్తామని, 150సీట్లు తెచ్చుకుంటామని ప్రజలని మభ్య పెట్టెందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన అర్బన్ డెవలాప్ పాలసీ రూపొందిస్తుందన్నారు.


Next Story

Most Viewed