టీఆర్ఎస్ తొత్తులా మాట్లాడటం సరికాదు.. కలెక్టర్ క్షమాపణ చెప్పాల్సిందే..

by  |
టీఆర్ఎస్ తొత్తులా మాట్లాడటం సరికాదు.. కలెక్టర్ క్షమాపణ చెప్పాల్సిందే..
X

దిశ ప్రతినిధి, మెదక్ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులు వరి వేస్తే ఉరేస్తామంటది.. మరోవైపు జిల్లా కలెక్టర్ రైతులను చెండాడుతా, వెంటాడుతా, ఖబడ్డార్ అంటూ మాట్లాడతాడు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక రాచరిక ప్రభుత్వమో తెలియకుండా పోతోంది. గతంలోనూ ప్రాజెక్టుల విషయంలో జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరించారు. సిద్దిపేట జిల్లాలో అధికారులు హద్దులు మీరుతున్నారు. పోలీస్ యాక్టు పేరులో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే రేపటి రోజున మీ ఓటమి ఖాయమైతే మిమ్మల్ని సైతం ఫాంహౌజ్ నుండి వెళ్లనీయమంటూ డీసీసీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులను హెచ్చరించారు. గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మాటలను నిరసిస్తూ కాంగ్రెస్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా డీసీసీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో దిశ ప్రత్యేక ఇంటర్యూ

దిశ : రైతులను రాజు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మీ వైఖరేంటి ?
నర్సారెడ్డి : వరి వేస్తామంటే రైతుల మెడలకు ఉరేస్తామన్న ప్రభుత్వం రైతులను రాజులను చేస్తుందా ? గతంలో రైతుల చేతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇలాంటి ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలి.

దిశ : యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది, మరీ ఏ పంటలు సాగు చేస్తే బాగుంటుంది?

నర్సారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఎందుకో రైతులకు తెలియజేయాలి. మన జిల్లాలో ఉన్న భూములు వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగుకు అనుకూలం. నియంత్రిత సాగు విధానంలో మొక్క వద్దన్నది, ఇప్పుడు వరి వద్దంటుంది. ఇది సరి కాదు. మన నేలలు వరి పంటలకు అనుకూలంగా ఉంటాయి. నీళ్లు పుష్కలంగా ఉండటంతో భూముల జాలు వారుతున్నాయి. ఇలాంటి సమయంలో జిల్లా రైతులకు వరి పంట వేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వరి వేసుకునే వెసులుబాటు కల్పించాలి.

దిశ : వరి వేయొద్దన్న కలెక్టర్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు ?

నర్సారెడ్డి : ఆయన కలెక్టర్ కాదు. సీఎం కాళ్లు మొక్కి టీఆర్ఎస్ తొత్తులా మారిండు. అలాంటి వ్యక్తి తక్షణమే కలెక్టర్ పదవికి రాజీనామా చేయాలి. సీఎం కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకే కలెక్టర్ అలాంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలని కోరిక ఉంటే కలెక్టర్ పదవి వదిలేయ్. అంతే కాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ తొత్తులా వ్యవహరిస్తామంటే కాంగ్రెస్ ఊరుకోదు. ఆయన క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ తన పోరాటం ఆపదు.

దిశ : కలెక్టర్ పై మీ పోరాటం ఎలా ఉండబోతుంది ?
నర్సారెడ్డి : ఈ కలెక్టర్ సీఎం మన్ననలు పొందేందుకు తాపత్రయ పడుతుండు. గతంలోనూ భూ నిర్వాసితులను అరిగోస పెట్టిండూ. తప్పక వారి ఉసురు తగులుతుంది. కలెక్టర్ క్షమాపణ చెప్పే వరకు మా పోరాటం ఆగదు. నేడు ఆరెస్టు చేయొచ్చు. అయినా తాము పట్టువీడమూ. మళ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తాం. కలెక్టరేట్ ను దిగ్భందిస్తాం. అరెస్టులకి మా కార్యకర్తలు భయపడరు.

దిశ : ప్రతిపక్షాలు ఆందోళన చేయకుండా పోలీస్ యాక్టు అమలు చేస్తున్నారు కదా ఏమంటారు ?
నర్సారెడ్డి : ఏ ప్రతిపక్ష పార్టీకైనా ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపేందుకు ఆందోళనలు, నిరసనలు తెలిపే హక్కు ఉంటుంది. కానీ సిద్దిపేట జిల్లాలో శాంతిభద్రతల పేరిట ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం 30 పోలీస్ యాక్టులు అమలు చేస్తోంది. ఇది నిజంగా సిగ్గు చేటు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, అడిగితే బెదిరింపులు, ఆందోళనలు చేస్తే అరెస్టులు చేయడం సరికాదు. జిల్లాలో పోలీసుల అరాచకం ఎక్కువైంది.

దిశ : ఏడేళ్ల సీఎం పాలన ఎలా ఉంది ?
నర్సారెడ్డి : ఏడేళ్ల సీఎం పాలన ఏడ్చినట్టే ఉంది. తెలంగాణలో ఏ ఒక్క సామాన్యుడు కూడా సంతోషంగా లేడు. అభివృద్ధి పేరిట దోచుకునుడు, దాచుకునుడు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. వ్యవసాయ పాలసీకి బదులు లిక్కర్ పాలసీ అమలు చేస్తోంది. సచివాలయానికి వెళ్లకుండా ఫాంహౌజ్ పరిపాలన సీఎం కేసీఆర్ కే స్వంతం, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఫాంహౌజ్ కి పంపడం ఖాయం.



Next Story

Most Viewed