మావోయిస్టు ఆర్కే మృతిపై కన్ఫ్యూజన్.. పార్టీ ప్రకటనే ఫైనల్‌!

by  |
Maoist Ramakrishna
X

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతి వార్తపై కన్ఫ్యూజన్ కొనసాగుతున్నది. బీజాపూర్ పోలీసులు అక్కడి మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారా ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ లీకులను, పోలీసులు ప్రకటించారనే వార్తలను విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల సంఘం ఖండించాయి. పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా ఉండే అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయి ఉన్నట్లయితే తొలుత ఆ పార్టీ నేతల నుంచే ప్రకటన వెలువడుతుందని, అది ఇప్పటివరకూ రానందున ఆయన క్షేమ సమాచారం గురించి స్పష్టతకు రాలేమని పేర్కొన్నాయి.

పార్టీ ప్రకటనే ఫైనల్ :

“పోలీసులు, ప్రభుత్వాలు గతంలో చాలాసార్లు కల్పిత కథలను ప్రసారం చేశాయి. ఉద్యమాన్ని నీరుగార్చడానికి నీచమైన స్టేట్‌మెంట్లూ ఇచ్చాయి. ఇప్పుడు కూడా ఆర్కే మృతి వార్త విషయంలో అలాంటి అనుమానాలే ఉన్నాయి. ఇంకా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఆర్కే చనిపోయినట్లైతే తప్పనిసరిగా పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుంది. అది రానంతవరకు పోలీసుల కట్టుకథలుగానే భావించక తప్పదు. అలాంటి ప్రకటన వస్తేనే నమ్ముతాం. ఆర్కే మృతిని ధృవీకరించాల్సింది పోలీసులు కాదు. మావోయిస్టు పార్టీ.”. -కల్యాణరావు, విప్లవ రచయిత

బైటకు తెలిసే అవకాశమే లేదు :

“మావోయిస్టు పార్టీలో సీనియర్ నేతగా ఉండి ఇప్పటికీ ఉద్యమ ప్రాంతంలోనే ఉన్న ఆర్కే క్షేమం గురించి అందరికంటే పార్టీకే ఎక్కువ తెలుసు. బైట సమాజానికి ఆయన క్షేమ సమాచారాల గురించి తెలిసే అవకాశమే లేదు. ఆయన క్షేమంగా ఉన్నా, అనారోగ్యంతో చనిపోయినా అది పార్టీకే తెలుస్తుంది. పార్టీ నుంచి ప్రకటన కూడా వస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. ఒకవేళ నిజంగా వైద్యం అందక చనిపోయినట్లయితే దాన్ని ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి. అటవీ గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేకపోవడానికి కారణం ప్రభుత్వాల చేతగానితనమే. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి”. – పాణి, విరసం మాజీ కార్యదర్శి

బాధ్యత మరచిన పోలీసులు :

“ఉద్యమకారుల మరణంపై ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయడం, మృతుల కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారాన్ని తెలియజేయడం వాటి కనీస బాధ్యత. కానీ ఇప్పటికీ చత్తీస్‌‌గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి అలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు మావోయిస్టు పార్టీ కూడా ఆర్కే మృతిపై ప్రకటన చేయలేదు. ఆర్కే చనిపోతే పోలీసులు మీడియాకు లీకులు ఇవ్వడానికి బదులుగా కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారం ఇవ్వాలి. ఏ రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వం ఆ పని చేయలేదు. బాధ్యత మరిచాయి. ఆర్కే చనిపోయాడంటూ ప్రచారం చేస్తున్న పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు లేదా బంధువులకు ఎందుకు అప్పగించడంలేదు? ఇదంతా పోలీసుల అసత్య ప్రచారమే”. – నారాయణరావు, కార్యదర్శి తెలంగా పౌరహక్కుల సంఘం


Next Story

Most Viewed