కేసీఆర్, ఉత్తమ్‌లకు కూడా తప్పని తిప్పలు

by  |
cm kcr, uttam kumar reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా టెస్టు రిపోర్టుల విషయంలో గందరగోళం నెలకొంది. ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తే.. రాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తోంది. ఈ రెండింటిలో పాజిటివ్ వస్తే.. సీటీస్కాన్‌‌లో నెగెటివ్ వస్తోంది. దీంతో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియక ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులూ తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం ఈ సమస్య ఎదురైంది. రాపిట్ టెస్టులో నెగెటివ్ రాగా, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి ఆరోగ్యంపై పూర్తి క్లారిటీ రాక, అటు ఆయన కుటుంబంలో, రాష్ట్ర ప్రజల్లో, టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నేటికీ చికిత్స పొందుతున్నారు.

తాజాగా.. టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికీ ఇదే సమస్య ఎదురైంది. అప్పటికే కరోనా పాజిటివ్ ఉన్న ఉత్తమ్‌కు ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. అనుమానం వచ్చి, మరోసారి టెస్టులు చేయించుకోగా, సీటీస్కాన్‌లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన మళ్లీ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా లక్షణాలు ఉంటే.. పాజిటివ్‌గా భావించి, వైద్యం తీసుకోవాలని సూచించింది. కాగా, 90 శాతం కరోనా నిర్ధారణ పరీక్షలన్నీ ప్రభుత్వం రాపిడ్ టెస్టుల ద్వారానే చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ వస్తే.. పరిస్థితి విషమించే వరకూ కరోనా బయటపడటం లేదని వైద్య నిపుణులు సూచించారు. అంతేగాకుండా.. సామాన్యులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు అందక, సీటీస్కాన్ కీలకంగా మారింది. సీటీస్కాన్‌లోనే కరోనా లక్షణాలు బయటపడుతున్నాయని అంటున్నారు.



Next Story