తెలంగాణ కాంగ్రెస్​లో అయోమయం

by  |
తెలంగాణ కాంగ్రెస్​లో అయోమయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అసలు పార్టీలో ఏం జరుగుతోందో తెలియని అయోమయం నెలకొంది. టీపీసీసీ చీఫ్​ నియామకం ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో వైపు ఒక్కొక్కరు పార్టీని వీడేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్​లో వేడి రాజుకుంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం వాయిదా వేయాలంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి అధిష్ఠానానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఇటలీలో ఉన్న రాహుల్​గాంధీ ఈ నెల 5 తర్వాత ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్​ను కలిసేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ​ మాణిక్కం ఠాగూర్​ను ఆదేశించింది. రాజగోపాల్​రెడ్డి తిరుపతిలో మాట్లాడిన వ్యాఖ్యల రికార్డులను సేకరించారు. నేడో, రేపో రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడే వద్దు

పీసీసీ పదవిపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. సోనియా గాంధీకి పలు సూచనలు చేశారు. తాను పంపిన లేఖ సోనియాగాంధీకి అందుతుందో.. లేదో అనే అనుమానంతో ఈ లేఖను మీడియాకూ విడుదల చేశారు. పార్టీకి లాయల్‌గా ఉండే నాయకత్వాన్ని ఎంపిక చేయాలని, పార్టీలో అంశాల వారీగా కమిటీ వేయాలని లేఖలో కోరారు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను గుర్తించి ఒక్కొక్కరికి ఐదు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని, నాగార్జున సాగర్ ఎన్నికల వరకు టీపీసీసీ నియామకం వాయిదా వేయాలని సోనియాకు లేఖలో విజ్ఞప్తి చేశారు.

మళ్లీ ఢిల్లీ బాట

మరోసారి టీపీసీసీ ఆశావహులు ఈ నెల 5 తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అదేరోజున ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఠాగూర్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండగా… ఆ మరునాడు కొంతమంది ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. ఎంపీ వెంకట్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్​తో సహా పలువురు ఢిల్లీకి వెళ్లి రాహుల్​ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



Next Story