ఏపీ-తెలంగాణ మధ్య ‘పవర్’ పంచాయితీ..!

by  |
ఏపీ-తెలంగాణ మధ్య ‘పవర్’ పంచాయితీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకూ జల వివాదాలు నడుస్తుండగా అందులోనే మళ్లీ ఇప్పుడు ‘పవర్’ పంచాయితీ తెర మీదకు వచ్చింది. శ్రీశైలం ఎడమ గట్టు వద్ద తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి చేయడం పట్ల ఏపీ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయమై కృష్ణా రివర్ బోర్డుకు ఈ నెల 23న ఫిర్యాదు చేసింది. దీనిపై కృష్ణా బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. విద్యుత్​ ఉత్పత్తి నిలిపివేయాలంటూ సూచించింది. ఇదే సమయంలో తెలంగాణ సర్కారు జెన్​కోకు సోమవారం ఆదేశాలిచ్చింది. 100 శాతం హైడల్​ విద్యుత్​ ఉత్పత్తి చేయాలంటూ స్పష్టం చేసింది.

వివాదం ముదురుతోంది

కృష్ణా జలాల వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు కృష్ణా జలాల తరలింపు, రాయలసీమ ఎత్తిపోతలపై మండిపడుతున్న తెలంగాణ ప్రభుత్వం… తాజాగా విద్యుత్​ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఏపీ లేఖ ఇవ్వడం, దానిపై కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడంపై సీరియస్‌గా పరిగణిస్తోంది. వాస్తవానికి కృష్ణాలోని ఎగువ ప్రాజెక్టుల్లో కూడా చిన్నపాటి వరద వచ్చినా ముందుగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్​రిజర్వాయర్లకు వరద మొదలైనప్పుడే జల విద్యుత్ మోటర్లను స్టార్ట్​చేశారు. ప్రస్తుతం వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ హైడ్రో విద్యుత్​స్టేషన్లను ప్రారంభించింది. దీనిపై ఏపీ అనవసరపు వాదనకు దిగుతున్నట్లు భావిస్తున్నారు.

కేఆర్‌ఎంబీ తీరుపై అసహనం

కృష్ణా బోర్డు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని ఫోటోలతో సహా రుజువు చేస్తూ ఫిర్యాదు చేసినా బోర్డు నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఎన్జీటీ, కేంద్రం కూడా రాయలసీమ పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి రావాలని సూచించినా.. ఏపీ అనుమతి కోసం ఆగాయి. ఏపీ వద్దంటే పర్యటనను వాయిదా వేసుకున్నాయి. దీనిపై తెలంగాణ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కు ఫిర్యాదు చేసింది. కేంద్రం నుంచి కూడా బోర్డుకు అక్షింతలు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా బోర్డు జల విద్యుత్ ఉత్పత్తిపై హడావుడిగా.. హెచ్చరికలు చేస్తూ లేఖ పంపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పు పడుతోంది.

100 శాతం విద్యుత్​ ఉత్పత్తి చేయండి

ఏపీ అహంకారపూరిత లేఖలంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా అదేస్థాయిలో వివాదానికి దిగుతోంది. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ ఏపీ లేఖ, దానిపై కేఆర్‌ఎంబీ.. ప్రభుత్వానికి లేఖ పంపడంతో ఆగ్రహించిన ప్రభుత్వం… ఇక నుంచి కృష్ణాపై ప్రాజెక్టుల్లో మొత్తం 100 శాతం జల విద్యుత్​ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎత్తిపోతల నీళ్లపై ఆధారపడి ఉందంటూ చెప్పింది. అయితే రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుంచి 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉందని, కానీ తక్కువ ఉత్పత్తి చేస్తున్నామని, ఇక నుంచి 100 శాతం హైడ్రో ఉత్పత్తిని ప్రారంభించాలంటూ జెన్‌కోకు ఆదేశాలిచ్చింది.

ఇదీ ఏపీ వాదన

శ్రీశైలంలో కనీస డ్రాయింగ్‌ లెవల్‌ 834 అడుగులు అయితే.. అంతకన్నా తక్కువ 808.40 అడుగులు నుంచే తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తికి నీటిని వినియోగిస్తోందని ఏపీ వాదిస్తోంది. ఈ వివరాలతో బోర్డుకు లేఖ రాసింది. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు 8.89 టీఎంసీలు శ్రీశైలం జలాశయంలోకి రాగా.. అందులో 3 టీఎంసీలు అంటే 34 శాతం నీటిని తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తికి వాడేసిందని వివరించారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలుపుదల చేయాల్సిందిగా కేఆర్‌ఎంబీకి ఈ నెల 23న లేఖ రాసింది. నీటి విడుదల ఆదేశాలను కేఆర్‌ఎంబీ జారీచేయకపోయినప్పటికీ ఈ నెల 1వ తేదీ నుంచే తెలంగాణ జెన్‌కో ఏకపక్షంగా శ్రీశైలం ఎడమ హైడ్రో ఎలక్ట్రిక్‌ స్టేషన్‌ నుంచి విద్యుదుత్పత్తికి నీటిని వినియోగిస్తోందని, నీటి అవసరం లేకున్నప్పటికీ తెలంగాణ జెన్‌కో ఇలా నీటిని వినియోగించడంవల్ల జలాశయంలో నీటి మట్టం అడుగంటిపోతోందని, జలాశయం నీటి మట్టం పెరగడానికి చాలా సమయం పడుతుందని ఆరోపించింది. దీనివల్ల పోతిరెడ్డిపాడు, చెన్నైకు తాగునీరు, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌కు నీటి సరఫరాకు తీవ్ర జాప్యం జరుగుతుందని, జలాశయంలో కనీసం 854 అడుగులు ఉంటేనే ఏడు వేల క్యూసెక్కులు డ్రా చేయగలమని, కృష్ణా బోర్డు ఆదేశాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఏపీకి కనీస సమాచారం ఇవ్వకుండా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో ఏకపక్షంగా చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలిపివేయాలని లేఖలో పేర్కొంది.


Next Story

Most Viewed