దారుణం.. కరోనా రోగులకు నీళ్లు కూడా ఇస్తలేరు

by  |
దారుణం.. కరోనా రోగులకు నీళ్లు కూడా ఇస్తలేరు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కరోనా రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఐసోలేషన్ సెంటర్‌లో ఉన్న వారికి మెరుగైన వైద్యంతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తాం. సమయానికి మందులు సైతం సిబ్బంది ఇస్తారు. వారికి అన్ని వసతులు కల్పిస్తాం’ సీఎంతో సహా మంత్రులు, టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్న మాటలు ఇవి. కానీ గద్వాల ఐసోలేషన్ సెంటర్‌లో పరిస్థితులు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి. కనీసం తాగేందుకు సైతం అక్కడి సిబ్బంది నీరు అందించడం లేదని కరోనా రోగులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఇప్పటికే వైరస్ సోకిన వారిలో కొందరు హోం క్వారంటైన్ లో ఉండగా మరి కొందరు ప్రభుత్వ ఐసొలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం తరపున కరోనా రోగులకు సహకారం అందిస్తామని, ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వారికి నాణ్యమైన భోజనం అందిస్తున్నామంటూ ప్రజాప్రతినిధులు సందర్భం దొరికినప్పుడల్లా చెబుతున్నారు. కానీ, గద్వాల ఐసోలేషన్ కేంద్రంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా నుంచి కొలుకునేందుకు ఇక్కడికి వస్తే ఆకలితో చనిపోయేలా ఉన్నామని అక్కడ చికిత్స పొందుతున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐసోలేషన్ కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం చెబుతున్న సౌకర్యాలు లేకపోగా కనీసం తిండి సైతం సరిగ్గా పెట్టడం లేదని వాపోతున్నారు. తమకు ఉడకని అన్నం, నీళ్ల చారు అందిస్తున్నారని వాపోతున్నారు.

తాగునీరు సైతం ఇవ్వడం లేదు

కరోనా సోకడంతో తాము ఇంట్లోనే ఉన్నామని, కానీ.. అధికారులు తమకు గద్వాల పీజీ కళాశాలలో ఉన్న ప్రభుత్వ ఐసొలేషన్ సెంటర్ కు తీసుకొచ్చారని కొవిడ్ బాధితులు చెబుతున్నారు. ఇక్కడ వసతులు సరిగ్గా లేవని, చివరకు తాగేందుకు సైతం నీటిని అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ వారు వాపోతున్నారు. మరుగుదొడ్లను సైతం సరిగ్గా క్లీన్ చేయడం లేదని చెబుతున్నారు.

వైద్యం అంతంత మాత్రమే..

ఐసొటేషన్ కేంద్రంలో రోగులను పరీక్షించేందుకు వైద్యులు రావడం లేదని అక్కడి రోగులు ఆరోపిస్తున్నారు. ఇంట్లోనే ఇంతకన్నా మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని.. ఇక్కడ కనీసం మందులు ఇచ్చే వారూ లేరన్నారు. వైద్యులు సైతం ఎపుడో ఒక సారి ఇలా వచ్చి అలా వెళ్తున్నారని వాపోతున్నారు. మెరుగైన వైద్యం అందించలేనప్పుడు తమను ఇక్కడికి తీసుకొచ్చి ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.

వీడియోపై స్పందించిన అధికారులు..

గద్వాల పీజీ కాలేజ్‌లోని ప్రభుత్వ ఐసోలేషన్‌లో నెలకొన్న అసౌకర్యాలపై సోషల్ మీడియాలో వీడియో హల్చల్ కావడంతో అధికారులు స్పందించారు. ఆర్డీవో రాములు వెంటనే రోగులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. వారికి నాణ్యమైన భోజనం, తాగునీటి వసతులు కలిపించి, వైద్యం అందిస్తామన్నారు.



Next Story

Most Viewed