కన్నింగ్ ‘కంప్యూటర్ ఆపరేటర్స్’.. ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. ఓనర్‌కు తెలీకుండానే..!

by  |
computer operators
X

ఆ మండల తహశీల్దార్‌కు కంప్యూటర్ ఆపరేటర్లు షాక్ ఇచ్చారు. వారు చేసిన పని ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు రెవెన్యూ అధికారులు. ఒక్క సంతకంతో ఏకంగా రూ.కోట్ల భూమిని మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ముడుపులు కూడా భారీగా అందుకున్నట్టు సమాచారం. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది.

దిశ, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో రవీందర్ సంతకం ఫోర్జరీ చేసిన విషయం స్థానికంగా కలకలం రేపింది. ఒక్క సంతకంతో ఏకంగా 7.12 గుంటల భూమిని మరొకరి పేరు మీద కంప్యూటర్ ఆపరేటర్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భూ యజమాని(ఇతియాజ్) కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో సర్వే నంబర్ 18లో 7.12 గుంటల భూమిని తనకు తెలియకుండానే ఎమ్మార్వో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లు ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిపాడు.

ఇతియాజ్‌కు తెలియకుండా భూమిని కొన్న ఖలీల్ అనే వ్యక్తి మరొకరికి ఆ భూమిని కూడా అమ్మడం జరిగింది. ఖలీల్ దగ్గర నుంచి కొన్న వ్యక్తి భూమి తన పేరు మీద పట్టా చేయించుకునేందుకు ప్రయత్నించగా ఇబ్బంది తలెత్తడంతో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా ఈ సమస్య పరిష్కరించాలని కలెక్టర్ ఎమ్మార్వోను ఆదేశించారు. దీనిని విచారణ చేపట్టిన ఎమ్మార్వో రవీందర్‌కు అసలు విషయం తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. భూ యజమాని భూమి అమ్మకుండా తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ మజ్జు, పరశురాం, మరో ముగ్గురిపై ఎమ్మార్వో పోలీసులకు ఈనెల 21వ తేదీన ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు రాకుండా ఎమ్మార్వో పోలీసులు జాగ్రత్త పడటం పలు విమర్శలకు దారితీస్తోంది.

ఈ ఐదుగురు వ్యక్తులు ఎమ్మార్వోకు తెలియకుండా.. ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారా..? లేదా అంతకు ముందు ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఇంకా ఏమైనా చేశారా..? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. వికారాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు ఎమ్మార్వోకు తెలియకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోట్ల భూమి స్వాహా చేసేందుకు ప్రయత్నించిన ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని భూమి యజమాని అధికారులను వేడుకుంటున్నాడు. తన భూమికి తనకు తిరిగి ఇప్పించాలని కలెక్టర్‌ను, ఎమ్మార్వోను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story