సెన్సేషనల్ న్యూస్.. రేవంత్‌పై ఏఐసీసీకి ఫిర్యాదు.. సీక్రెట్ లేఖల కలకలం

by Shyam |   (  Updated:2021-10-12 22:47:42  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​లో అసంతృప్తి నేతలకు అవకాశం చిక్కింది. హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం పార్టీలోని అసంతృప్తి వర్గానికి మంచి సమయంగా కలిసి వచ్చినట్లవుతోంది. ఇప్పటికే కోవర్టులు, అసంతృప్తిలు అంటూ టీపీసీసీ నుంచి కొంతమందిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ నివేదిక పంపినట్లు గాంధీభవన్​ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ టీపీసీసీ పీఠం అంశంలో తీవ్ర అసంతృప్తితో రగులుతున్న నేతలు రేవంత్​రెడ్డిపై ఏఐసీసీకి లేఖల దాడి [&hellip;]</p>

Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​లో అసంతృప్తి నేతలకు అవకాశం చిక్కింది. హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం పార్టీలోని అసంతృప్తి వర్గానికి మంచి సమయంగా కలిసి వచ్చినట్లవుతోంది. ఇప్పటికే కోవర్టులు, అసంతృప్తిలు అంటూ టీపీసీసీ నుంచి కొంతమందిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ నివేదిక పంపినట్లు గాంధీభవన్​ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ టీపీసీసీ పీఠం అంశంలో తీవ్ర అసంతృప్తితో రగులుతున్న నేతలు రేవంత్​రెడ్డిపై ఏఐసీసీకి లేఖల దాడి మొదలుపెట్టారు. ఏకంగా నలుగురు సీనియర్లు ఏఐసీసీకి వరుస ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చగా మారింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవంటూనే ఢిల్లీకి రహస్యంగా లేఖలు రాసినట్లు చెప్పుకుంటున్నారు.

లేఖలో ఏముందంటే..?

హుజురాబాద్​ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి విషయంలో సుదీర్ఘమైన చర్చలు సాగించారు. రెండు కమిటీలు అభ్యర్థిని ఎంపిక చేశాయి. స్థానిక నేతకు ఇవ్వాలని ఓ కమిటీ చెప్పింది. ఇదే సమయంలో మాజీ మంత్రి కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. కానీ అందరినీ కాదని ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ను బరిలోకి దింపారు. దీనిలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి చక్రం తిప్పారని ఒక వర్గం చెప్పుతుంటే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒత్తిడితోనే వెంకట్​కు టికెట్​ ఇచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే వెంకట్​కు టికెట్​ ఖరారు కావడంపై రేవంత్​రెడ్డికి మాత్రం కొత్త తలనొప్పి తీసుకువచ్చింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్​కు మద్దతు కోసమే అక్కడ వెంకట్​ను పోటీకి దింపారనే ఆరోపణలు పార్టీలోనే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఓ మాజీ ఎంపీ కూడా ఈ హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు అనుకూలంగా ఉంటున్నారనే ఆరోపణలు సైతం మూటగట్టుకుంటున్నారు. అయితే రేవంత్​రెడ్డిపై మాత్రం పార్టీలోని నలుగురు సీనియర్లు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల అంశం ఇప్పుడు పార్టీలో హాట్​ టాపిక్​గా మారాయి.

ఈటలను గెలిపించేందుకే అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టలేదని లేఖల్లో రేవంత్​రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రచారపర్వంలో కూడా సరైన ప్రణాళిక లేదంటూ విమర్శలు చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఓ ఎంపీ, మరో మాజీ ఎంపీ ఒకరి తర్వాత ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ ఈ లేఖ పంపినట్లు తెలుస్తుండగా.. పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న మరో నేత కూడా లేఖ రాసినట్లు పార్టీ నేతల్లో టాక్​. అంతేకాకుండా తాజాగా మరో ఎంపీ కూడా హుజురాబాద్​ అంశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఆరోపణలు సంధించినట్లు చర్చ సాగుతోంది. అయితే కొంతమంది పార్టీ శ్రేణులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నా.. సీనియర్లు మాత్రం మౌనంగానే ఉంటున్నారు.

ప్రచారానికి వెళ్తారా..?

మరోవైపు పార్టీలో అసంతృప్తి నేతలుగా ఉంటున్న ఎంపీలు ఉత్తమ్​, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో పాటుగా ఆయా సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేసే జగ్గారెడ్డి వంటి నేతలను స్టార్​ క్యాంపెయినర్లుగా తీసుకున్నారు. వాస్తవంగా పలుమార్లు కీలకమైన సమావేశాలకు టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ ఎగనామం పెడుతున్నారు. ఇటీవల ఉమ్మడి వరంగల్​ జిల్లా భూపాలపల్లిలో జరిగిన సమావేశానికి కూడా వెళ్లలేదు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్​కు జగ్గారెడ్డి ఇంచార్జ్​ కూడా. కానీ అనారోగ్యం, ఏదో కారణమంటూ తప్పించుకున్నారు. గతంలో కూడా ఓ కీలకమైన మీటింగ్​కు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం హుజురాబాద్​లో టీఆర్​ఎస్​, బీజేపీ దూసుకుపోతున్నాయి. ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. కానీ కాంగ్రెస్​ నుంచి మాత్రం ఇంకా ఉలుకూ, పలుకూ లేదు. రేవంత్​రెడ్డి ఒక్కసారి అలా వెళ్లి.. ఇలా వచ్చేశారు. మళ్లీ దానిపై ఊసెత్తడం లేదు. మరోవైపు ఎంపీలు ఉత్తమ్​ సైలెంట్​గానే ఉంటున్నా.. వెంకట్​రెడ్డి మాత్రం పలు సందర్భాల్లో ఫైర్​ అవుతూనే ఉన్నారు. ప్రస్తుతం హుజురాబాద్​కు ప్రచారానికి వెళ్తారా.. లేదా అనేది మాత్రం ఇంకా సందేహమే.

లేఖలపై ఏం చేస్తారో..?

రాష్ట్రంలో పార్టీ నేతల్లో ఎంత అసంతృప్తి ఉన్నా.. ఏఐసీసీ నుంచి మాత్రం రేవంత్​రెడ్డికి అనుకూల ప్రకటనలే వస్తున్నాయి. అటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ ఠాగూర్​ కూడా రేవంత్​ను సమర్థిస్తూనే ఉన్నారు. పార్టీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా.. పట్టించుకోవడం లేదు. తాజాగా హుజురాబాద్​ అంశంలో కూడా అంతే. అయితే ఇప్పుడు కొన్ని అంశాలను సాకుగా చూపిస్తూ ఢిల్లీకి సీక్రెట్​ లెటర్లు పంపించారు. దీనిపై ఏఐసీసీ నుంచి ఏమైనా రిప్లై ఉంటుందా.. లేదా అనేది తేలాల్సిందే.

Next Story