ఏడాదిలోగా పూర్తి చేస్తాం: ఇంద్రకరణ్ రెడ్డి

by  |
ఏడాదిలోగా పూర్తి చేస్తాం: ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, ఆదిలాబాద్: గోదావ‌రి ఆధారితంగా నిర్మ‌ల్ జిల్లాలో చేప‌ట్టిన పంట కాలువ పనుల్లో వేగం పెంచి ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి అల్లోల‌ ఇంద్రకరణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శనివారం గుండంప‌ల్లి వద్ద 27 ప్యాకేజీ పంప్ హౌజ్ పనులను సీయం ఓఎస్డీ శ్రీధ‌ర్ రావు దేశ్ పాండేతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంట కాలువ నిర్మాణం, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ … ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంలో భాగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, ప్రతి ఎకరాకు నీళ్ళందించేలా దృష్టిసారించారన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పంటలకు సాగు నీరు అందించే దిశగా పనుల్లో వేగం పెంచాలన్నారు.

గోదావరి ఆధారితంగా కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనులతో నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. 65 శాతం పనులు పూర్తయ్యాయని, ఇంకా 35 శాతం పనులు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. మాడేగావ్ వద్ద నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయన్నారు. ఇంకా 5 కిలోమీటర్లకు గాను నాలుగున్నర కిలోమీటర్ల మేర పని పూర్తి అయ్యిందని, మరో అర కిలోమీటర్ పనులు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. ఈ ప్యాకేజీ పనులు పూర్తి అయితే నిర్మల్ జిల్లా మరింత సశ్యశ్యామలం అవుతుందని ఆయన అన్నారు. మంత్రి వెంటా కలెక్టర్ ముషార‌ఫ్ ఫారూఖీ, ఎస్ఆర్ఎస్పీ సీఈ శంకర్ గౌడ్, ఇత‌ర‌ అధికారులు ఉన్నారు.



Next Story

Most Viewed