ఇరిగేషన్ క్వార్టర్స్ ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు

by  |
ఇరిగేషన్  క్వార్టర్స్ ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు
X

దిశ, అచ్చంపేట : దోమలపెంటలో ఇరిగేషన్ క్వార్టర్స్ ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధి అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇండ్లు అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సి.ఐ.టి.యు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఇరిగేషన్ శాఖలో ఉన్న క్వార్టర్స్‌ను సి.ఐ.టి.యు సంఘం ఆధ్వర్యంలో సర్వే చేయగా మొత్తం క్వార్టర్స్ 500 వరకు ఉన్నాయని, ఇందులో 100 క్వార్టర్స్‌కు పైగా ఆక్రమణకు గురైనట్లు తెలిపారు. గ్రామానికి సంబంధించిన కాంట్రాక్టర్స్, పెత్తందారులు ఆక్రమించి కబ్జా చేసుకున్నారని, కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు అమ్ముకొని వెళ్ళిపోయారని ఆరోపించారు. కొంతమంది చనిపోయిన వారి పేరున ఉంటున్నారని, ఇట్టి విషయాన్ని మేము ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకోకపోయినా సంబంధిత అధికారులు ఆక్రమించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇప్పుడైనా ప్రభుత్వానికి సంబంధించిన క్వార్టర్స్‌ను, స్థలాలను కాపాడుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఇరిగేషన్ శాఖ‌లో ఉన్న క్వార్టర్స్‌ను విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో జి కమల, ఎం. చంద్రకళ, సీపీఎం నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.


Next Story