టీపీసీసీ ఫైట్.. వారిద్దరి మధ్యే పోటీ

by  |
టీపీసీసీ ఫైట్.. వారిద్దరి మధ్యే పోటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు ఒక తంతు ముగిసింది. 2 ఏండ్లుగా సాగుతున్న టీపీసీసీ కొత్త చీఫ్​ ఎవరనే ప్రచారానికి త్వరలోనే తెర పడే అవకాశాలున్నాయి. ఈ నెల 9 నుంచి వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్యం ఠాగూర్​శనివారం ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానానికి నివేదిక అందించనున్నారు. ఈ నెల 15లోగా టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అందరి అభిప్రాయాలు..

టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీ పడే నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు తానంటే తాను రేసులో ఉన్నానంటూ ప్రకటించుకున్నారు. ఈ నెల 9న రాష్ట్రానికి వచ్చిన ఠాగూర్ కోర్​ కమిటీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించారు. అనంతరం అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయం వరకు 65 మంది అభిప్రాయాలను తీసుకున్న ఠాగూర్, అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు టీపీసీసీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో గాంధీ భవన్‌లో విడివిడిగా భేటీ అయ్యారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలను సేకరించారు.

ఇద్దరి మధ్యే…?

టీపీసీసీ అధ్యక్ష పీఠం సీనియర్లందరినీ ఊరిస్తోంది. అయితే అభిప్రాయ సేకరణలో చాలా మంది నేతలు రేవంత్​రెడ్డి, కోమటిరెట్టి వెంకట్​రెడ్డి పేర్లను సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం రేవంత్​రెడ్డికి రాష్ట్రంలో ఫాలోయింగ్​ ఉందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరిలోనే ఎవరో ఒకరికి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. ఏదిఏమైనా మెజార్టీ నేతల మనోగతాన్ని పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సి ఉంటుందని పలువురు చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed