సైడ్ ఎఫెక్ట్‌లు కలిగితే పరిహారం : భారత్ బయోటెక్

by  |
సైడ్ ఎఫెక్ట్‌లు కలిగితే పరిహారం : భారత్ బయోటెక్
X

న్యూఢిల్లీ: తమ టీకా తీసుకున్న తర్వాత తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్‌లు కలిగితే సదరు లబ్దిదారులకు పరిహారమందిస్తామని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. కొవాగ్జిన్ టీకా వేసుకునేవారితో ముందుగా సమ్మతి పత్రంపై సంతకం తీసుకుంటున్నారు. తమ టీకాతో దుష్ప్రభావాలు కలిగితే ప్రభుత్వం గుర్తించిన ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటళ్లలో చికిత్స పొందుతారని ఆ పత్రంపై సంస్థ పేర్కొంది. టీకా వల్లే అనారోగ్యం బారిన పడినట్టు నిరూపణ అయితే అందుకు పరిహారం చెల్లిస్తామని వెల్లడించింది. కొవాగ్జిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో వైరస్‌ను నిలువరించే కణాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు తేలింది. కానీ, టీకా పూర్తిస్థాయి సామర్థ్యం ఇంకా వెల్లడి కాలేదు. ఎందుకంటే మూడో దశ ట్రయల్స్ ఫలితాలను ఇంకా పరిశీలించాల్సి ఉన్నది. అందుకే ఈ టీకా వేసుకున్నంత మాత్రానా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదని భావించవద్దని సంస్థ సమ్మతి పత్రంలో సూచించింది. ఈ టీకాకు ‘క్లినికల్ ట్రయల్ మోడ్’ అనుమతులే ఇచ్చినందున సీరియస్ సైడ్ ఎఫెక్ట్‌లు ఏర్పడితే భారత్ బయోటెక్ సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story