కమ్యూనిస్టు నేత బూర్గుల నర్సింగరావు కన్నుమూత

by  |
కమ్యూనిస్టు నేత బూర్గుల నర్సింగరావు కన్నుమూత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు, అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు బూర్గుల నర్సింగరావు (89) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న నర్సింగరావు పరిస్థితి విషమించి మరణించారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్న నర్సింగరావు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలోనూ తనదైన పాత్రను పోషించారని పలువురు గుర్తు చేసుకున్నారు. తమకు పెద్దదిక్కుగా ఉంటూ నిరంతర కమ్యూనిస్టు పోరాటాలకు, కమ్యూనిజం వ్యాప్తికి పనిచేశారని పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ తెలిపారు. నర్సింగరావు మరణం కమ్యూనిస్ట్, ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటన్నారు. నర్సింగరావు మృతి పట్ల వామపక్ష పార్టీల నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కె. ప్రతాపరెడ్డి, ఆరుట్ల ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆరుట్ల సుశీల సంతాపం ప్రకటించారు.

ఆయన సేవలు చిరస్మరణీయం: కేటీఆర్
తెలంగాణకు నర్సింగరావు సేవలు చిరస్మరణీయమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నర్సింగరావు మృతి పట్ల సంతాపం తెలిపిన కేటీఆర్ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. హైద్రాబాద్ సంస్థానంలో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు, తెలంగాణా తొలిదశ పోరాటం నుంచి మలిదశ పోరాటం వరకు అలుపెరుగని ఉద్యమకారుడిగా ఆయన చరిత్రలో నిలిచారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed