ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి : పార్థసారధి

by  |
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి : పార్థసారధి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి అన్నారు. శుక్రవారం ఎస్​ఈసీ కార్యాలయం నుంచి జీహెచ్​ఎంసీ కమిషనర్​, జోనల్​ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితా మార్క్​డ్ కాపీలు పూర్తి చేసి ప్రతి పేజీపై ఏఆర్​ఓ సర్టిఫై చేయాలన్నారు. ఈ నెల 29 నాటికి 100 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, చనిపోయిన, ఇల్లు మారిన, నివాసం లేని వారి వివరాలను ఏఎస్​డీ జాబితాలో ఉంచాలన్నారు.

వార్డుల వారీగా పోస్టల్ బ్యాలెట్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, పోస్టల్ బ్యాలెట్ల బట్వాడా చేసిన వారి వివరాలు తయారు చేయాలన్నారు. వాటిని రిటర్నింగ్​ అధికారులు నోటీస్​ బోర్డులపై ప్రకటించాలని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైతే పలుమార్లు శిక్షణ ఇవ్వాలని, అవగాహన కల్పించాలని, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పంపిణీలో ఎటువంటి తప్పులు దొర్లకుండా సరిచూసుకోవాలన్నారు. మిస్సింగ్ నెంబర్లను గుర్తించి వాటికి సంబంధించిన వివరాలను నోటీస్ బోర్డుపై ప్రకటించాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు తెలుపాలన్నారు. పోలింగ్ సందర్భంగా పొరపాట్లు, అవకతవకలు జరిగితే క్షమించేది లేదని, ఏ కారణాల వల్ల కూడా రీపోలింగ్ జరిగే అవకాశం రావద్దని పార్థసారధి హెచ్చరించారు.

పోలింగ్ సామాగ్రిని ముందుగానే ప్యాక్ చేసి వుంచాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు ప్రదర్శించాల్సిన పోటీచేయు అభ్యర్ధుల జాబితా, పోలింగ్ ఏరియా వివరాలు సరిగా వుండాలని, ఓటింగ్ గదుల్లో సరైన వెలుతురు ఉండాలన్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, సేకరణ కేంద్రంలో వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్లలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, రెండు కౌంటింగ్ హాల్స్ ఉన్న కేంద్రాలకు ఒక అదనపు రిటర్నింగ్ అధికారిని నియమించామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర వీల్​ఛైర్లు, ర్యాంపులు ఉన్నాయని, 150 వార్డులలో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ వద్ద ఫేస్ రికగ్నిజేషన్​ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని పార్థసారధి ఆదేశించారు.



Next Story

Most Viewed