సంక్రాంతి తర్వాత కాలేజీలు

by  |
సంక్రాంతి తర్వాత కాలేజీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి పండుగ తర్వాత కళాశాలలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా తర్వాత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరగతి గది బోధన తిరిగి పట్టాలెక్కేలా కనిపిస్తోంది. ఏడు నెలలుగా కొనసాగుతున్న ఆన్‌లైన్ క్లాసులకు మరో రెండు వారాల్లో తెరపడేలా ఉంది. పండగ తర్వాత ఇంటర్ కళాశాలలు తెరుచుకుంటాయని విద్యాశాఖ మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. అయితే విద్యాసంస్థల రీఓపెనింగ్‌పై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తరగతి గది బోధనకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి తీపికబురు తెలిపారు. సంక్రాంతి పండుగ అనంతరం ఇంటర్మీడియట్ కళాశాలలు తెరుచుకుంటాయని శనివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్‌లో ప్రారంభమవ్వాల్సిన తరగతులు కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తి తర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రాథమిక స్థాయి నుంచి పీజీల వరకూ అంతటా అదే పరిస్థితి.. పాఠాలు, పరీక్షలు, అకాడమిక్ ఇయర్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా కాలం గడుస్తోంది. బోర్డులు, యూనివర్సిటీలు ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్లు తమ పని చేసుకు వెళ్తున్నారు. తరగతి గది బోధన స్థానంలో ప్రైవేట్ యాజమాన్యాలు ఏప్రిల్ నెల నుంచే ఆన్‌లైన్ క్లాసులకు తెరతీశాయి. కొత్తగా స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు, ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతూ వస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పది నెలలుగా ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఆన్‌లైన్ క్లాసులు వింటున్న విద్యార్థులు పాఠాలు అర్థం కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. తరగతులు నిర్వహిస్తున్నామనే పేరుతో ఫీజుల వసూళ్లు ఆపడం లేదు. కంప్యూటర్లు, మొబైల్స్ ముందు గంటల కొద్దీ గడుపుతున్న విద్యార్థులు కండ్లు, వెన్నెముక సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతున్నా.. రేడియేషన్‌కు గురవుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చోక తప్పడం లేదు. పది నెలలుగా సాగుతున్న ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులు కొత్తగా నేర్చుకున్నదేమీ లేదు. తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తుండటంతో విద్యార్థులను ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేలా చూసుకుంటున్నారు. పాఠ్యాంశాలు అర్థం కావడం లేదని, ఆర్థికంగా భారమవుతుందని, తర్వాత ఫీజు చెల్లిస్తామన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఫీజు చెల్లించని విద్యార్థులకు ఆన్‌లైన్ లింక్‌ను కట్ చేయడంతో పాటు అడ్మిషన్లు రద్దు చేసుకోవాలంటూ వారిపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారంతా అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తూ వస్తున్నారు.

ప్రైవేట్ కళాశాలలు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా డిజిటల్ పాఠాలను ప్రారంభించింది. ఇంటర్మీడియట్ బోర్డు సెప్టెంబర్ నెలలో 180 రోజుల అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి నెలలోనే ప్రీ-ఫైనల్, మార్చి 24 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. సంక్రాంతి తర్వాత కళాశాలలు తెరుచుకుంటే రెండు నెలల్లోనే అంతా ముగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెకండియర్ సైన్స్ గ్రూపు విద్యార్థులు ఇప్పటి వరకూ ల్యాబ్‌ల్లోకి అడుగు పెట్టనే లేదు. వారంతా ప్రాక్టికల్ పరీక్షలు ఎలా పూర్తిచేస్తారన్నది ప్రశ్న.. అకాడమిక్ ఇయర్‌ను తగ్గించిన నేపథ్యంలో స్టేట్, సీబీఎస్‌ఈ బోర్డులు 30 శాతం సిలబస్‌ తగ్గిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థులు నష్టపోతారని వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. సాధారణంగా ఏడాదంతా బోధించే సిలబస్‌ను ఇప్పుడు రెండు నెలల్లోనే పూర్తి చేసి పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. మరో వైపు తరగతి గది బోధన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. లాక్‌డౌన్ తర్వాత అకాడామిక్ ఇయర్‌ను ప్రారంభించేందుకు కేంద్రం మార్గనిర్దేశకాలు కూడా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పండగ సెలవులను రద్దు చేసి 180 రోజుల అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. నవంబర్ 2 నుంచి అక్కడ కరోనా జాగ్రత్తలతో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే మన రాష్ట్రంలో విద్యాశాఖ ప్రతిపాదనలు సీఎంకు చేరినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అకాడమిక్ ఇయర్‌ను ప్రారంభించే విషయంలో విద్యాశాఖ అధికారులు రకరకాల ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి చేరుకున్నాయి. అయితే ఇప్పటివరకూ సీఎం సమావేశానికి పిలవలేదని అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖ మంత్రి ప్రకటించినప్పటికీ తుది నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయిలోనే జరగాల్సి ఉంది. మంత్రి సూచనప్రాయంగా ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతికి ముందే సీఎం తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల విధానంలో మార్పులు సహా ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నుంచి అనుమతి రావాల్సి ఉంది. పండగకు ముందే విద్యాశాఖతో సీఎం సమావేశం నిర్వహించి తుది నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది.

Next Story

Most Viewed