మెడిసిన్ విద్యార్థుల్లో నిరాశ.. లక్షలు పోసి చదివినా చివరకు..

by  |
nursing students
X

మీ అమ్మాయి/అబ్బాయిని డాక్టర్​చేయాలనుకున్న మీ కల సాకారం కావడం లేదా? నీట్​లో సీటు రాలేదని బాధ పడుతున్నారా? మేమున్నాం.. మాయమాటలతో నమ్మించి బురిడీ కొట్టిస్తున్న సంస్థలెన్నో హైదరాబాద్​లో తిష్టవేశాయి. ఏజెంట్లను నియమించుకొని సోషల్​మీడియాతోపాటు హోర్డింగులు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తూ.. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. పొరుగు దేశాలకు తీసుకెళ్లి అక్కడో నాసిరకం కాలేజీలో జాయిన్​చేస్తున్నారు. అక్కడ ఎంబీబీఎస్​ పూర్తి చేసిన వారు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీ పరీక్ష పాస్​కావాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో సగటున 20% మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారు. లక్షలు పోసి చదివించిన మిగతా 80% మంది క్లినికల్​ అసిస్టెంట్లుగానే మిగిలిపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నీట్​లో ర్యాంక్​ తగ్గిందా? పర్వాలేదు మేమున్నాం.. తక్కువ ఫీజుతోనే ఎంబీబీఎస్​సీట్ ఇప్పిస్తాం.’ అంటూ కొన్ని ప్రైవేట్ సంస్థలు మెడిసిన్​చదవాలనుకుంటున్న విద్యార్ధులు, తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. ఏజెంట్లును పెట్టి తతంగం నడుపుతున్నాయి. సోషల్​ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. తక్కువ ఫీజుకే సీట్లు ఇప్పిస్తామని తప్పుదోవ పట్టిస్తున్నాయి. తమ బిడ్డలను ఎట్లైనా మెడిసిన్​చదివించాలన్న ఆసక్తి తల్లిదండ్రులకు ఏజెంట్లు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కమీషన్ గా తీసుకుంటున్నారు. చివరికి నాణ్యత లేని కాలేజీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. దీంతో తమ పిల్లలకు సరైన విద్య అందడం లేదని, తద్వారా నైపుణ్యతను పరిశీలించే ఎఫ్​ఎంజీ పరీక్షల్లో ఫెయిల్​అవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలా అన్యాయం చేస్తున్న కన్సల్టెన్సీలపై కొందరు పేరంట్స్ ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఏటా 5 వేల మంది

తెలంగాణ నుంచి ఏటా సుమారు నాలుగువేల నుంచి ఐదు వేల మంది విదేశాల్లో ఎంబీబీఎస్​ విద్యను పూర్తి చేస్తున్నారు. వారిలో 20 శాతం మంది మాత్రమే డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. మిగతా వారంతా మన దేశంలో నేషనల్ బోర్డు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామ్‌ పాస్ కాలేకపోతున్నారు . దీంతో నేషనల్​ మెడికల్​ కమిషన్​ రిజిస్ట్రేషన్​ పొందడం సాధ్యం కావడం లేదు. ఇతర దేశాల్లో చదివిన ఎంబీబీఎస్ వృథా అవుతున్నది. చేసేదేమీ లేక తక్కువ జీతానికి క్లినికల్​అసిస్టెంట్లుగా చేరాల్సిన పరిస్థితి నెలకొంది. కెనడా, న్యూజిలాండ్‌, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రం ఎఫ్​ఎంజీ పరీక్ష నుంచి మినహాయింపు ఉన్నది. మిగతా దేశాల్లో ఎక్కడ చదివినా ఎఫ్ఎంజీ పరీక్ష రాయడంతోపాటు.. ఉత్తీర్ణత సాధించాల్సిందే.

2023లో మార్పులు..

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎన్ని సార్లనైనా ఎఫ్​ఎంజీ రాసేందుకు వీలున్నది. 2023 నుంచి నెక్స్ట్‌ స్టెప్ 1, నెక్ట్స్‌ స్టెప్‌ 2 పేరిట రెండు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందని మెడికల్​ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌ఎంజీ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్‌ ను తీసుకురాబోతున్నారు. దీనిని విదేశాల్లో చదివిన వాళ్లతో పాటుగా, మన దేశంలో చదివిన వారూ రాయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఎంబీబీఎస్​ పూర్తయిన తర్వాత రెండేళ్లలో ఈ పరీక్ష పాసైతేనే డాక్టర్​అయ్యే చాన్స్ ఉంటుంది.
ఐదు ఎఫ్‌ఎంజీఈ వివరాలు

సంవత్సరం ఉత్తీర్ణతపొందినవారు(శాతం) ఫెయిల్

జూన్ 2021 4283(24.93) 12,895
డిసెంబర్, 2020 3722(21.34) 13,713
జూన్, 2020 1697(10.95) 13,790
డిసెంబర్, 2019 4242(29.7) 10,025
జూన్, 2019 2767(23.5) 9,006

Next Story

Most Viewed