తడి,పొడి చెత్తను వేరు చేయకుంటే.. జరిమానా

by  |
తడి,పొడి చెత్తను వేరు చేయకుంటే.. జరిమానా
X

దిశ, మెదక్: తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని.. స్వయం సహాయక సంఘాల మహిళలకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం కంది మండలం తోపుగొండ, చర్లగూడెం గ్రామాలను కలెక్టర్ సందర్శించారు. తోపుగొండ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను విడివిడిగా వేస్తున్నారా లేదా అనేది ఆయా ఇళ్ల మహిళలతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని డంపింగ్‌యార్డు, నర్సరీని పరిశీలించారు. అనంతరం గ్రామ చావడి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేయడానికి గ్రామాల్లో ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. తడి చెత్తతో ఎరువు చేయాలని, పొడి చెత్తను అమ్ముకోవాలని సూచించారు. అలాగే డంపింగ్‌యార్డును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుంచి నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేయని వారికి ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు రూ.50, జులై 1 నుంచి 15 వరకు రూ.500 చొప్పున, 15 తరువాత రూ.1000 జరిమానా విధించడానికి గ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేశారన్నారు. డంపింగ్‌యార్డు వినియోగంతో తడి, పొడి చెత్త వేరుగా వేయడంతో గ్రామమంతా శుభ్రంగా ఉంటుందని, రైతులకు అవసరమైన ఎరువు తయారవుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జెడ్పీ సీఈఓ రవి, డీఆర్డీఓ శ్రీనివాస రావు, డీఎఫ్ఓ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed