నర్సరీల నిర్వహణలో లోపాలు.. కలెక్టర్ ఆగ్రహం

by  |
నర్సరీల నిర్వహణలో లోపాలు.. కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, మెదక్: నర్సరీల్లో అనేక రకాలైన మొక్కలు పెంచాల్సి ఉండగా, కేవలం ఒకే రకమైన మొక్కలు పెంచడం పట్ల మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హవేళిఘనపూర్ మండల పరిధిలోని ముత్తాయికోట, ఫరీద్ పూర్, బూర్గుపల్లి గ్రామాలతో పాటు పంచాయతీ పరిధిలో ఉన్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. ఫరీద్ పూర్ గ్రామస్తులు కోరిన అన్ని రకాల మొక్కలను పెంచాల్సి ఉండగా, కేవలం ఒకే రకమైన మొక్కలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం సమీపంలో మహబూనహర్ నుంచి పోతుకుంటకు సాగునీరు వెళ్లే కాలువలో మురుగు, చెత్త, ప్లాస్టిక్ పేరుకు పోవడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. కార్యదర్శి, గ్రామ సర్పంచ్, సెక్రటరీలకు నోటీసులు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి హనుకను ఆదేశించారు. ‘గ్రామంలోని సమస్యలను పట్టించుకోక పోతే ఎలా.. మీరున్నది ఎందుకని’ కార్యదర్శి మహేశ్ చంద్రపై ఆగ్రహించారు. మండల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని, అధికారులు పనితీరు మార్చుకోవాలన్నారు. అనంతరం నీటిపారుదల శాఖ ఈఈ ఏసయ్యకు ఫోన్ చేసి మాట్లాడుతూ కాలువ మరమ్మతులు ప్రారంభించాలని ఆదేశించారు. బూర్గుపల్లిలో పారిశుద్ధ్యం, నర్సరీలను పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story