అలర్ట్.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వారి హాజరు, సౌకర్యాలపై ఆరా..

by  |
అలర్ట్.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వారి హాజరు, సౌకర్యాలపై ఆరా..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ క‌లెక్టర్ గోపి.. ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. గురువారం ఉదయం జిల్లాలోని వరంగల్, దుగ్గొండి మండలాలలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సంద‌ర్భంగా అక్కడి ఆరోగ్య ఉప కేంద్రాల‌ను సంద‌ర్శించారు. సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించారు. వైద్యం అందుతున్న తీరుపై క‌లెక్టర్ రోగుల నుంచి ఆరా తీశారు.

ఆసుపత్రిలోని వైద్య సేవ‌ల‌పై అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. ముందుగా వరంగల్‌లోని కాశిబుగ్గలో ఉన్న సబ్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించి ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పక్రియ ఎంతమందికి జరిగిందో అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ చేసుకున్న వారి వివరాలు రిజిస్టర్‌లో నమోదు చెశారా లేదా అని కలెక్టర్ స్వయంగా రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో ఉన్న సబ్ సెంటర్‌ను పరిశీలించి వ్యాక్సినేషన్ కోసం వచ్చిన ప్రజలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సరిపోవడంలేదని అదనపు గదులు కావాలని సిబ్బంది.. కలెక్టర్‌కు తెలిపారు. అడిగిన వెంటనే కలెక్టర్ ఎస్టిమేషన్ వేసి వివరాలు పంపాల్సిందిగా డీఎం అండ్ హెచ్‌వోకు తెలిపారు. అనంతరం వెంకటాపురం గ్రామంలో సబ్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలను పలకరించి.. వ్యాక్సినేషన్ ఏర్పాట్లను, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూదానం చేసిన రైతు రామారావుకు కలెక్టర్ సన్మానం చేశారు.

అనంతరం దుగ్గొండి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అన్ని వార్డులను పరిశీలించి ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన వారి పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్‌వో వెంకటరమణ, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో ప్రకాష్, ఎంపీపీ కె. కోమల, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, డాక్టర్లు క్రాంతి కుమార్, రాజు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed