నేను హామీ ఇస్తున్నా.. 10 రోజుల్లో మార్పు గమనిస్తారు

by  |
నేను హామీ ఇస్తున్నా.. 10 రోజుల్లో మార్పు గమనిస్తారు
X

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ పట్టణం సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, చెత్తా చెదారం రోడ్లపై వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలో 10 రోజుల్లోనే అనేక మార్పులను గమనిస్తారని కలెక్టర్ అన్నారు. శనివారం ఉదయం 5:40కి జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి నాగర్ కర్నూల్ పట్టణంలోని 10వ వార్డు మినీ ట్యాంకుబండ్, రైతు బజార్ బస్టాండ్, నల్లబెల్లి రోడ్డు, పట్టణ ప్రధాన వీధుల గుండా మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లవెంబడి పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. మున్సిపల్ కార్మికులతో మాట్లాడుతూ పట్టణంలో కార్మికులు నిర్వహించే పనులను పరిశీలించి వీధుల్లో సేకరించిన చెత్తను ఎక్కడ డంపు చేస్తారో వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెత్తాచెదారాన్ని బయట వేసే దుకాణ దారులకు ఫైన్ లు వేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బస్టాండ్ పరిసరప్రాంతాలు సులబ్ కాంప్లెక్స్ ను కలెక్టర్ పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న మూత్రశాల నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్ పరిసరప్రాంతాలు అపరిశుభ్ర వాతావరణంగా ఉన్నందున డిపో మేనేజర్ ను కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు. పట్టణంలోని పలువురు వీధి వర్తక దారులతో కలెక్టర్ మాట్లాడుతూ వీధి వర్తక దారుల రుణ సదుపాయానికి దరఖాస్తు చేసుకున్నారా అని అడిగారు. చేసుకొని వారందరూ ఈ రోజే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారికి కలెక్టర్ సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా 10,000 రూపాయల రుణ సదుపాయం కల్పించిందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకే మార్నింగ్ వాక్ చేశామని, పట్టణంలో పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించి పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ వెంట నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఇతర మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed