ఈసీ సూచన ప్రకారమే Dalitha Bandhu .. లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

by  |
Dalitbandhu
X

దిశ, కరీంనగర్ సిటీ: ఉపఎన్నిక నోటిఫికేషన్‌తో హుజురాబాద్‌లో దళితబంధు పథకం నిలిచిపోతుందనే ఆందోళనలో పడ్డ లబ్ధిదారులకు ఊరట లభించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందునుంచే ఈ పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో.. యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఎన్నికల సంఘం సూచనల మేరకు దళిత బంధుపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. షెడ్యూల్ విడుదలతో దళితబంధుపై వస్తున్న ఊహాగానాలకు అధికారులు క్లారిటీ ఇవ్వగా.. ఖాతాల్లో డబ్బులు జమ అయిన లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్‌కు అడ్డంకులు లేకుండా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దళితుల సాధికారతే ధ్యేయంగా, వారికి స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా కరీంనగర్ జిల్లాలో అమలు చేసేందుకు నిర్ణయించినప్పటికీ, గత ఆగస్టు 16న పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విడతల వారీగా రూ.2 వేల కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టి.. 24,267 దళిత కుటుంబాలను గుర్తించారు. వీరికి ఇష్టమైన ఉపాధి యూనిట్లపై సర్వే చేసి, ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

దీనిననుసరించి.. దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేశారు. ఇప్పటివరకు 17 వేల మంది అకౌంట్లకు.. వారికి కేటాయించిన మొత్తం నిధులు విడుదల చేశారు. దళితులు ఎంపిక చేసుకున్న యూనిట్లు గ్రౌండింగ్ చేసిన అనంతరం, వారి ఖాతాల్లోని మొత్తం యూనిట్లు విక్రయదారులకు చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు ఈ దిశగా ముందుకు సాగుతున్న క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

దీంతో గ్రౌండింగ్ ఆగిపోయి.. దళితబంధు నిలిచిపోతుందనే భయం లబ్ధిదారుల్లో నెలకొంది. పథకం అమలు పర్యవేక్షిస్తున్న అధికారులకు అనేకమంది లబ్ధిదారులు ఫోన్లు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన యంత్రాంగం దళిత బంధు అమలుపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పటిమాదిరిగానే యూనిట్ల గ్రౌండింగ్ కొనసాగుతుందని, మిగతా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేసేందుకు ఎన్నిక సంఘం చేసే సూచనలు పాటిస్తామని కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ ప్రకటించారు.

Next Story

Most Viewed