కనికరం లేని కరోనా.. వీరుడ్ని బలి తీసుకుంది

by  |
కనికరం లేని కరోనా.. వీరుడ్ని బలి తీసుకుంది
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా ప‌నిచేస్తున్న‌ డాక్ట‌ర్ న‌రేష్ శుక్ర‌వారం ఉద‌యం క‌రోనాతో మృతిచెంద‌డంపై క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేశారు. కనికరం లేని కరోనా ఒక వీరుడ్ని బలితీసుకుందని క‌లెక్ట‌ర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. ఇటీవలే వైద్య విద్యలో పీజీ సాధించిన నరేష్ కొన్ని రోజుల్లో ఉన్నత చదువులకు వెళ్లాల్సి ఉన్న సమయంలో వ్యాధితో మరణించడం చాలా దురదృష్టకరమని చెప్పారు.

విధులపై అంకిత భావం కలిగిన యువ వైద్యుడ్ని జిల్లా ప్రజలు కోల్పోయారని, జిల్లాలో కరోనా కట్టడిలో నరేష్ సేవలు మరువలేనివని చెప్పారు. మణుగూరు క్వారంటైన్ కేంద్రం ఇంచార్జ్ అధికారిగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలో కరోనా వ్యాధి సోకడం అత్యంత బాధాకరమన్నారు. ప్రజా రక్షణలో వైద్యుడు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అతని ఆకస్మిక మరణం మన జిల్లా ప్రజలకు తీరని లోటని ఈ రోజు ఒక ఆత్మీయుడిని కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. ప్రాణాలకు ముంపు ఉందని తెలిసిన ముందుండి పోరాడే వైద్య సిబ్బందిని కూడా వ్యాధి కనికరం లేకుండా బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.


Next Story