జిల్లా పరిషత్ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

by  |
జిల్లా పరిషత్ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
X

దిశ, భూపాలపల్లి : జిల్లా పరిషత్ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ కృష్ణ ఆదిత్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫైళ్ల నిర్వహణ తీరును, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైళ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, ఈ-ఆఫీస్ పద్ధతిలో ఫైళ్లను నిర్వహించకపోవడంతో ఆఫీస్ సూపరింటిండెంట్ శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఆస్తుల వివరాలు, ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, సెలవులు తదితర అన్ని వివరాలను ఈ-ఆఫీస్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించినప్పటికీ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎందుకు నిర్వహించడం లేదని ఫైర్ అయ్యారు. వారం రోజులలోగా జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే మొత్తం 90 మంది వివిధ కేటగిరీల ఉద్యోగుల వివరాలు, సర్వీస్ రూల్స్, డిసిప్లినరీ కేసులు, లీవ్స్, ఇంక్రిమెంట్స్, జడ్పీ ఆస్తుల వివరాలను ఈ-ఆఫీసులో పొందుపరచాలని ఆదేశించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా ఇంక్రిమెంట్ పొందడం ఉద్యోగుల హక్కు అని ఇంక్రిమెంట్ కోసం ఉద్యోగులు ఎవరు అధికారుల చుట్టూ తిరగకుండా సమయానికి ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని అన్నారు.

ఉద్యోగులందరూ ఖచ్చితంగా ఈ-అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేసుకోవాలని, హాజరు నమోదు వివరాలను సూపరింటిండెంట్ పర్యవేక్షించాలని అన్నారు. నెల రోజులకు పైగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజర్ లో ఉన్న టైపిస్ట్ రఘునాథ్ రెడ్డి కి మెమో జారీ చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్ ను సందర్శించి రెవెన్యూ రికార్డులను గ్రామాలు, మండలాలు, సర్వే నెంబరుగా విడదీసి క్రమపద్ధతిలో భద్రపరుస్తున్న తీరును పరిశీలించారు. ఎలాంటి తేడా లేకుండా ఈజీగా రికార్డులను ఎప్పుడైనా పరిశీలించే విధంగా భద్రపరచాలని అదేవిధంగా రికార్డులు అన్నింటిని స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆర్డీఓ శ్రీనివాస్ ను, ఏవో సుమన్ ను ఆదేశించారు.

Next Story