ఉద్యోగులు అనవసరంగా బయట తిరిగితే చర్యలు

by  |

దిశ, నిజామాబాద్: ఉద్యోగులు అవసరం లేకున్నా వాహనాలకు ఆన్ డ్యూటీ స్టిక్కర్లు వేసుకొని బయట తిరిగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలన్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్నిశాఖల్లో రొటేషన్ పద్ధతిలో ఉద్యోగులను కార్యాలయాలకు, విధులకు అనుమతించడానికి వెసులుబాటు కల్పించిందని, అయితే కొందరు ఉద్యోగులు విధుల్లో లేకున్నా వాహనాలకు ఆన్ డ్యూటీ స్టిక్కర్లు అతికించుకుని అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అత్యవసర విధులు నిర్వర్తించే పోలీస్, వైద్యఆరోగ్య శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు, సిబ్బందికి మాత్రమే కార్యాలయాల సమయం ముగిశాక కూడా విధులకు హాజరు కావడానికి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, ఇతరులకు అవకాశం లేదన్నారు. ఈ క్రమంలోనే అధికారుల కుటుంబ సభ్యులు, ప్రైవేటు వ్యక్తులు కూడా ప్రభుత్వ వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా బయట తిరుగుతున్నారని, ఇకమీదట అలాంటి వారు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా క్రిమినల్ కేసులు పెడుతామన్నారు.

Tags: corona, lockdown, duty stickers, collector narayana reddy

Next Story

Most Viewed