రూ.30 ల‌క్షలు మంజూరు చేస్తే.. రూ.50 ల‌క్షల‌కు టెండ‌ర్లేంటి?

by  |
Collector Krishna Aditya
X

దిశ‌, వెంక‌టాపురం: ప‌ర్యాటక ప్రాంతానికి వ‌స్తోన్న అధికారుల‌కు ఇబ్బందులు క‌లుగకుండా వాజేడు, వెంక‌టాపురం మండ‌లాల్లోని త‌హ‌సీల్దారు కార్యల‌యాల స‌మీపంలో అతిథి గృహాల నిర్మాణం కోసం రూ.30 ల‌క్షలు మంజూరు చేస్తే.. రూ.50 ల‌క్షల‌కు టెండ‌ర్లు ఎలా పిలుస్తార‌ని ములుగు జిల్లా క‌లెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ‌వారం స్థానిక త‌హ‌సీల్దారు కార్యాల‌యంలో మిష‌న్ భ‌గీర‌థ, పంచాయితీ రాజ్ అధికారుల‌తో ప్రత్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పంచాయితీ రాజ్ శాఖ అధికారుల తీరుపై అస‌హ‌నం వ్యక్తం చేశారు. ప‌ర్యాట‌క కేంద్రాల్లో నిర్మిస్తోన్న అతిథి గృహ‌లకు మంజూరు చేసిన నిధుల‌తోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠ‌శాల‌ల మ‌ర‌మ్మతుల పురోగతిపై పంచాయితీ రాజ్ శాఖ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. పది పాఠ‌శాలల మ‌ర‌మ్మతులు నేటికీ ప్రారంభం కాలేద‌ని, మిగిన పాఠశాలలు మరమ్మతు దశల్లో ఉన్నాయని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ నిధులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా.. ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప‌నుల పురోగ‌తికి సంబంధించిన ఎంబీల‌తో రేపు క‌లెక్టరేట్‌కు రావాలని అధికారులను ఆదేశించారు.

ఏజెన్సీల్లోని గిరిజ‌న గ్రామాల ప్రజ‌ల‌కు తాగునీరు అందడం లేదని రాంబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో స్పందించిన క‌లెక్టర్ మిష‌న్ భ‌గీర‌థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మండ‌లంలో డెంగీ, మ‌లేరియా విష‌జ్వరాల‌తో ఏజెన్సీ అత‌లాకుతలం అవుతోందని చెప్పగానే, గిరిజనులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం రాచ‌ప‌ల్లి పంచాయితీ మ‌ల్లాపురం వ‌ద్ద పాలెం వాగుపై ఉన్న ప్రాజెక్టును ప‌రిశీలించారు. ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు. ప్రాజెక్టు గేట్లు అలారం లేకుండా ఎత్తడం వ‌ల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని జెడ్పీటీసీ పాయం రమణ, ఎంపీపీ చెరుకూరి సతీష్, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంట ఆడిషినల్ కలెక్టర్ ఆదర్శ సురభి, ఇరిగేషన్ ఈఈ, డీఈ, పంచాయితీ రాజ్ అధికారులు, తహసీల్దార్ నాగరాజు, పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాతంలో పర్యటన సందర్భంగా ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ అలం పర్యవేక్షణలో ఎస్‌ఐ తిరుపతి చర్యలు తీసుకున్నారు.

Next Story

Most Viewed