హుజురాబాద్ అభ్యర్థులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

by  |
Collector R.V. Karnan
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చులను విధిగా సమర్పించాలని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశంలో ఉప ఎన్నికల పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ చేసే అభ్యర్థులకు నగదు రూపకంగా డబ్బులు ఇవ్వవద్దని, చెక్కులు, డి.డి.లు, ఆన్ లైన్ క్యాష్ ట్రాన్స్ ఫర్ మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు బ్యాంకులో ఖాతా ఉండాలని, అది జీరో బ్యాలెన్స్ గా ఉండాలని, బ్యాంకు ఖాతా నుంచే ఎన్నికల ఖర్చు లావాదేవీలు నిర్వహించాలన్నారు.

ఎన్నికల ప్రకటన విడుదలైన తేదీ నుంచి వారం రోజుల లోపు స్టార్ క్యాంపెయిన్ కు వచ్చే వారి వివరాలను ముందుగానే అందించాలని, ప్రచారానికి ఉపయోగించే పోస్టర్లు, కరపత్రాల పై పబ్లిషర్ పేరు తప్పకుండా ముద్రించాలని, ఖర్చు వివరాలు ఏ రోజుకారోజు ఎన్నికల పరిశీలకుడికి అందించాలని తేల్చి చెప్పారు. ఎన్నికల ఖర్చుల పై ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., వి.వి.టి., బృందాల నిఘా ఉంటుందని, అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే సమాచారం ఇవ్వాలని, పత్రికలలో, సోషల్ మీడియాలో, వెబ్ సైట్లో ప్రకటించాలని, భారత ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పాటించాలన్నారు. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటే బహిరంగ సభలు అయితే 1,000 మంది వరకు, ఇన్ డోర్ సమావేశాలకు 200 మందికి మించకుండా, సాధారణ సమావేశాలకు 500 మందికి మించకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు.

రోడ్డు షోలకు బైక్, కార్లు, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థి, అతడి రాజకీయ పార్టీ 20 వాహనాలను మాత్రమే వినియోగించుకొవాలని అన్నారు. ఎన్నికలకు 72 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని కలెక్టర్ తెలిపారు. కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, రాము, ఉపసంచాలకులు, ఆడిట్ శాఖ, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, కళ్యాడపు ఆగయ్య, మహ్మద్ అకిల్ ఫిరోజ్, నాంపెల్లి శ్రీనివాస్, చీటి రాజేందర్ రావు, చంద్రశేఖర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed