అయ్యో.. బిర్యానీలో బొద్దింక.. మున్సిపల్ కమిషనరుకే ఝలక్

by  |
అయ్యో.. బిర్యానీలో బొద్దింక.. మున్సిపల్ కమిషనరుకే ఝలక్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : భోజనం కోసం వెళ్లిన మున్సిపల్ కమిషనర్‌కు స్థానిక హోటల్ వారు ఝలకిచ్చారు.. తనతో పాటు తమ సిబ్బంది నాలుగు ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేయగా.. అందులో బొద్దింక, పురుగులు వచ్చాయి.. ఊహించని సంఘటనతో షాక్కు గురైన ఆయన.. వెంటనే తేరుకుని కిచెన్ ను తనిఖీ చేశారు.. పురుగుల బిర్యానీతో పాటు రెండు మూడు రోజులుగా నిల్వ ఉన్న, కుళ్లిన చికెన్‌ దొరికింది. కిచెనులో అపరిశుభ్రమైన వాతావరణం ఉంది. దీంతో కిచెన్ సీజ్ చేసి రూ.50వేల జరిమానా విధించారు. ఇదీ బిర్యానీ తిందామని హోటల్‌కి వచ్చిన నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌ బాలకృష్ణకి పురుగుల బిర్యానీ వడ్డించి అడ్డంగా బుక్కయ్యారు లక్ష్మీ గ్రాండ్ హోటల్ వారి కథ..!

నిర్మల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మి గ్రాండ్ హోటల్‌కి మునిసిపల్‌ కమిషనర్ బాలకృష్ణ, సిబ్బందితో కలిసి లంచ్‌ చేద్దామని వెళ్లారు. నాలుగు ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేశారు. వెంటనే హోటల్‌ సిబ్బంది వేడివేడి బిర్యానీ తెచ్చి వడ్డించారు. ప్లేట్లలో బిర్యానీతో పాటు బొద్దింకలు, పురుగులు చూసి.. కమిషనర్ ఒక్కసారిగా అవాక్కయారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన కమిషనర్ బిర్యానీని పక్కన పెట్టి సిబ్బందితో కలిసి హోటలును తనిఖీ చేశారు. హోటల్ కిచెన్ గదిలో తనిఖీలు చేయగా.. ఫ్రిజ్ లో కుళ్లిన చికెన్, మటన్, కలుషిత ఆహారం బయటపడింది. ఫ్రిజ్ లో ఉంచిన చికెన్ పురుగులు పట్టి ఉంది. కిచెన్ పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో.. మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకే ఇలాంటి భోజనం పెడుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. లక్ష్మి గ్రాండ్ హోటల్ పై కేసు నమోదు చేసి కిచెన్ ను సీజ్ చేశారు. రూ.50వేలు జరిమానా వేయటంతో.. తర్వాత హోటలు వారు డబ్బులు చెల్లించి రశీదు తీసుకున్నారు. ఇందులో కమిషనర్ తో పాటు డీఈ నాగేశ్వర్ రావు, ఏఈ వినయ్, సిబ్బంది ఉన్నారు. భోజనం కోసం హోటల్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని.. కలుషిత ఆహారమని అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలంటూ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ పేర్కొన్నారు.


Next Story

Most Viewed