5జీ స్పెక్ట్రమ్ ధరను 50-60 శాతం తగ్గించాలని కోరిన పరిశ్రమ సంఘం!

by  |
5g
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రంగంలో 5జీ సేవల కోసం ప్రతిపాదించిన వేలంలో స్పెక్ట్రమ్ ధరను సగానికి పైగా తగ్గించాలని పరిశ్రమ సంఘం సీఓఏఐ ప్రభుత్వాన్ని కోరింది. 2021, మార్చిలో రేడియో ఏయిర్‌వేవ్‌ల మొదటి వేవ్‌లో ప్రభుత్వం ఏడు బ్యాండ్‌లలో 2,308.80 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను దాదాపు రూ. 4 లక్షల కోట్ల రిజర్వ్ ధరతో అందించింది.

అయితే, మూలధర అధికంగా ఉండటంతో 700 మెగాహెర్ట్జ్, 2,500 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌ల కోసం స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నిర్వహించే స్పెక్ట్రమ్ వేలం ఉంటుందనే అంచనాల మధ్య సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) స్పెక్ట్రమ్ మూల ధరను 50-60 శాతం తగ్గించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

దీనిపై సీఓఏఐ అధికారికంగా స్పందించలేదు. 3.3-3.6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో ఒక మెగాహెర్ట్జ్‌కు స్పెక్ట్రమ్ మూలధను రూ. 492 కోట్లుగా నిర్ణయించాలని ట్రాయ్ కేంద్రానికి సూచించింది. 20 మెగాహెర్ట్జ్‌లను ఒక బ్లాక్ రూపంలో విక్రయించాలని తెలిపింది. దీనివల్ల దేశం మొత్తం ఒక కంపెనీ 5జీ సేవలు అందించేందుకు రూ. 9.840 కోట్లను వ్యయం చేయాల్సి ఉంటుంది. కాగా, దేశీయంగా 5జీ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మొదట దీనికి ఆరు నెలలు గడువును విధించగా, ఈ మధ్యనే దీన్ని 2022, మే వరకు పొడిగిస్తూ టెలికాం విభాగం ప్రకటించింది.



Next Story

Most Viewed