‘దళిత బంధు’ డబ్బులు చేతికివ్వం.. నేరుగా వారి ఖతాలోకే : రాహుల్ బొజ్జా

by  |
rahul-bojja
X

దిశ, కరీంనగర్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా అందజేసే మొత్తంతో లబ్ధిదారులు నగదు లావాదేవీలు నిర్వహించే అవకాశం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లబ్దిదారులు ఏర్పాటు చేసుకునే యూనిట్‌కు సంబంధించి నేరుగా వీరి ఖాతాల్లోంచి విక్రయదారులకు బదిలీ అవుతాయన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులందరినీ ఈ పథకంలో చేర్చనున్నట్లు, ఇందుకు సంబంధించిన జాబితా రూపొందించి లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు.

రాష్ట్రంలో హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ తీసుకున్న దృష్ట్యా ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రతలు తీసుకుంతున్నట్లు, లబ్ధిదారులు నిర్వహించబోయే యూనిట్ వివరాలు, సర్వే సమయంలోనే బృందాలు సేకరిస్తాయని తెలిపారు. లబ్దిదారులకు అందించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని, ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో రూ.1500 కోట్లు జమ అయినట్లు, ఆ మోతాన్ని లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేస్తామని చెప్పారు. ఈ పథకం రాష్ట్రంలోని దళితులందరికీ వర్తించబోతోందని, దళితుల గణన పూర్తి కాగానే నిధులు అందజేసి అవసరమైన వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి లబ్దిదారులు యూనిట్ పెట్టుకోవచ్చని, ప్రారంభించాక రెండేళ్ల పాటు పర్యవేక్షణ ఉంటుందన్నారు. లబ్దిదారులందరికీ వ్యక్తిగత ఖాతాలు తీసి, ఆ మొత్తం జమ చేయనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. ఈనెల 27నుంచి పూర్తి స్థాయి సర్వే నిర్వహించనున్నట్లు, హుజురాబాద్‌లో 21 వేల మంది ఎస్సీలు ఉన్నట్లు, వీరందరి ఇళ్లలోకి జిల్లా స్థాయి అధికారి వెళ్లి సర్వే చేయనున్నట్లు తెలిపారు. రోజుకు 100 నుంచి 150 ఇళ్ళు పూర్తి చేస్తారని, సర్వే సందర్భంలోనే వారికి కొత్త ఖాతాలు ప్రారంభిస్తామన్నారు. ఇందుకు గాను ప్రతీ మండలానికి ఒక బ్యాంకుకు బాధ్యత అప్పగించినట్లు తెలిపారు.సమావేశంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.



Next Story

Most Viewed