బాలికల చదువు ఆగిపోకూడదు : జగన్

by  |
బాలికల చదువు ఆగిపోకూడదు : జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్‌కీన్లను పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్‌కిన్స్‌ పంపిణీకి సర్కార్‌ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యక్రమం యెుక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు.

విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. రుతుక్రమ సమస్యలతో బాలికల చదువులు ఆగిపోతుందని.. అలా జరగకూడదనే ఉద్దేశంతో 7 నుంచి 12 వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,388 స్కూళ్లు, కళాశాలల్లో సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రతి నెల జేసీ (ఆసరా) ఆధ్వర్యంలో న్యాప్ కీన్లపై పర్యవేక్షణ జరగాలని సూచించారు. మహిళా టీచర్లు, ఏఎన్ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దిశయాప్, దిశ చట్టంపై బాలికలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్‌ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్‌కిన్స్‌ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టిందని సీఎం జగన్ వెల్లడించారు. యూనిసెఫ్‌, వాష్‌, పీ అండ్‌ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై బాలికలకు అపోహలు తొలగించనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

రూ.32కోట్లతో 10లక్షల న్యాప్ కీన్స్ పంపిణీ

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది బాలికలకు 32 కోట్ల వ్యయంతో నాణ్యమైన శానిటరి న్యాప్ కీన్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా స్తంభాలగరువులోని మున్సిపల్ హై స్కూల్‌లో జరిగిన స్వేచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విద్యార్థినిలు చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ప్రభుత్వం విద్య, వైద్య, మహిళల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరితతోపాటు ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు, కల్పాలతా రెడ్డి, మేయర్ కావాటి మనోహర్ నాయుడు, కలెక్టర్ వివేక్ యాదవ్ ఇతర అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed