డెసిషన్ పెండింగ్.. హోంమంత్రి పదవి ఉంచుతారా.. ఊడగొడ్తారా..!

by  |
డెసిషన్ పెండింగ్.. హోంమంత్రి పదవి ఉంచుతారా.. ఊడగొడ్తారా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నిర్వాకం శివసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కొత్త చిక్కులు తీసుకొచ్చింది. నెలకు రూ.100 కోట్లు కలెక్ట్ చేయాలని హోంమంత్రి పోలీసులకు టార్గెట్ విధించారని, ఆ పనిని ముంబై క్రైం బ్రాంచ్ యూనిట్ హెడ్ సచిన్ వాజేకు అప్పగించారని మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే‌కు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. అది కాస్త మహారాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది.

స్వయంగా ముంబై మాజీ కమిషనర్ హోంమంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో ప్రతిపక్ష బీజేపీ పార్టీ అధికార పార్టీపై నిప్పులు చెరిగింది. వెంటనే హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని పట్టుబడుతున్నారు. అయితే, పరంబీర్ సింగ్ వ్యాఖ్యలను హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఢిల్లీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో శివసేన ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై బీజేపీ పెద్దలకు వివరించారు. హోంమంత్రిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, సీఎం ఉద్ధవ్, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

ముఖేష్ అంబానీ ఇంటివద్ద ఆపిన వాహనంలో జెలెటిన్ స్టిక్స్ బయట పడ్డాక తొలుత ఈ కేసును ముంబై పోలీసులు డీల్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును NIA అధికారులు టేకప్ చేయడంతో ముఖేష్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉంచిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ యూనిట్ హెడ్ సచిన్ వాజే ఇన్వాల్వ్ అయినట్లు తేలడంతో శివసేన ప్రభుత్వం మరింత చిక్కుల్లో పడింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ మర్డర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు ముంబైలో జరుగుతున్న పరిణామాలు, అవినీతిపై ఎంపీ నవనీత్ కౌర్‌ పార్లమెంటులో ప్రస్తావించారు. అందుకు బదులుగా శివసేన ఎంపీ ఒకరు ‘నీ అందమైన ముఖంపై యాసిడ్‌ దాడి చేస్తామని’ బెదిరించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ఆమె స్పీకర్ ఓం బిర్లాకు సైతం ఫిర్యాదు చేశారు. మొత్తంగా కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న ‘మహా’ను ముఖేష్ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు, హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు శివసేన సర్కార్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బుధవారం కేబినెట్ మీటింగ్‌కు ఆదేశించారు. ఎన్సీపీ పార్టీకి చెందిన అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని మంత్రి పదవి నుంచి తొలగిస్తారని పలు కథనాలు వెలువడుతున్నాయి. దొరికిన అస్త్రాన్ని బీజేపీ తనదైన శైలిలో ఉపయోగించుకుంటోంది. నిన్న కేంద్రహోంశాఖను కలిసిన ఫడ్నవీస్, ఈ కేసుపై దర్యాప్తు చేయించాలని బీజేపీ లీడర్లు తాజాగా ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేబినెట్ మీటింగ్ కొనసాగుతుండగా దీనికి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా హాజరయ్యారు. అయితే, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వంపై వచ్చిన మచ్చను తొలగించుకోవడానికి దేశ్‌ముఖ్‌‌‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తారా..? లేదా అనేది ఉద్ధవ్ థాకరే తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed