రెండవ విడత గొర్రెల పంపిణీకి సీఎం ఆదేశం

by  |
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెండవ విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో గొర్రెల పంపిణీపై చర్చించారు. మొదటి విడత రూ.5000 కోట్ల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలనిచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేపట్టేందుకు రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థికశాఖను ఆదేశించారు.

రెండు విడతల్లో కలిపి గొల్ల కురుమల అభివృద్ధికి రూ.11,000 కోట్లు కేటాయిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 20 గొర్రెలు, ఒక పొట్టేలును యూనిట్‌గా కొనసాగిస్తున్నట్టుగా సీఎం స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా యూనిట్ ధరను పెంచాలని నిర్ణయించారు. కుల వృత్తులకు జీవం పోసి బీసీ వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వివరించారు. బీసీల అభివృద్ధి వలన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమతుందని, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.


Next Story