పీవీ తెలంగాణ ఠీవీ

by  |
పీవీ తెలంగాణ ఠీవీ
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో పీవీ శత జయంతి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 28న పీవీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దాదాపు 50దేశాల్లో పీవీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని, అందుకు తక్షణమే రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ, కేబినెట్‌లో తీర్మానించి ప్రధాని మోడీకి రిక్వెస్ట్ చేస్తామన్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, వంగరలో పీవీ కాంస్య విగ్రహాల ఏర్పాటుతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో పీవీ చిత్రపటాన్నిపెడుతామన్న సీఎం, పార్లమెంట్‌లోనూ పీవీ చిత్రపటాన్ని పెట్టాలన్నారు. పీవీ తెలంగాణ ఠీవి అని, ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించేలా ఆయన చరిత్ర ఉందని, చేసిన సేవలు, గొప్పతనం విశ్వవ్యాప్తంగా తెలిసేలా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ ఏర్పాటుకు రాజ్యసభ సభ్యులు కేకే నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ ఏర్పాటు చేస్తామన్నారు. కేకే నేతృత్వంలోని సభ్యులు రామేశ్వరం వెళ్లొచ్చి, పీవీ మెమోరియల్ ట్రస్ట్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలని స్పష్టం చేశారు. యావత్ దేశ ప్రజలకు పీవీ గొప్పతనం తెలిసే విధంగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్‌తో పీవీకి అనుబంధం ఉందని, వారిద్దరినీ కూడా భాగస్వామ్యం చేసేలా కార్యక్రమం రూపొందించాలన్నారు.



Next Story