బిగ్ బ్రేకింగ్: సీఎం సంతకంతో పీఆర్సీకి క్లియరెన్స్​

by  |
government employees, PRC statement
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగులకు వేతన సవరణ క్లియరెన్స్​ వచ్చింది. నాలుగు రోజులుగా సీఎం పేషీలో ఉన్న ఫైల్​కు శనివారం రాత్రి సీఎం కేసీఆర్​ ఆమోదముద్ర వేశారు. సీఎం సంతకంతో పీఆర్సీకి క్లియరెన్స్​ వచ్చింది. దీనిలో ప్రధానంగా కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేతన సవరణ కమిషన్​ సూచించినట్లుగానే వేతనాల పెంపు, కనీస వేతనాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. అయితే ప్రతి ఏడాది రూ. 1000 ఇంక్రిమెంట్​ ఇచ్చే అంశంపైనే క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్​మెంట్​ అమలు కానుంది.

ఈ నెల 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్​ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్​ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్​ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్​ అటు సాగర్​ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్​ పెండింగ్​ పడింది. కానీ ఎట్టకేలకు ఈ శనివారం రాత్రి క్లియర్​ అయింది. కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల వేతన పెంపుపై ఆర్థిక శాఖ ఎలాంటి మార్గదర్శకాలు, ప్రతిపాదనలు చేయలేదు. కానీ సీఎం మాత్రం వేతన సవరణ కమిషన్​ సూచనలను పరిగణలోకి తీసుకుని వేతనాల పెంపును చేయాలంటూ నిర్ణయం తీసుకుని, ఫైల్​పై సంతకం చేశారు. దీంతో ఉద్యోగవర్గాలందరికీ పీఆర్సీ అమలు చేస్తున్నారు. దీంతో వచ్చేనెల పెరిగిన సొమ్ముతో ఉద్యోగవర్గాలు వేతనాలు అందుకోనున్నారు.

ఎలా అంటే..?

మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులు,హోంగార్డులు,అంగన్‌వాడీలు,ఆశా వర్కర్లు,విద్యా వాలంటీర్లు,వీఆర్ఏ,వీఏవో,సర్వ శిక్షఅభియాన్ సిబ్బందికి కూడా పీఆర్సీ వర్తింపజేస్తున్నట్లు గతంలోనే సీఎం ప్రకటించారు. ఈ పీఆర్సీతో మొత్తంగా 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందుతున్నారు.
కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల కోసం వివరాలను పీఆర్సీ నివేదిక ప్రకారం ఆర్థిక శాఖ మరోసారి వివరించింది.

ఇప్పటి లెక్కల ప్రకారం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు–4 కేటగిరీలో ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్‌ ఆర్డర్లీ, చౌకీదార్, ల్యాబ్‌ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్‌ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్‌/క్యాషియర్, లిఫ్ట్‌ ఆపరేటర్లకు నెలకు రూ. 12 వేలు ఇస్తుండగా… వీరికి కనీస వేతనం రూ. 19 వేలు చేయాలని పీఆర్సీ కమిషన్‌ సిఫారసు చేసింది. రూ. 13 వేల నుంచి రూ.15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కూడా బేసిక్‌ పే రూ. 19 వేలు చేయాలని సిఫారసు చేసింది. గ్రూపు–3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్‌ ఆపరేటర్, స్టోర్‌ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్‌ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్‌/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, లైబ్రేరియన్, మేనేజర్‌ కేటగిరీల్లో నెలకు రూ. 15 వేలు వేతనంగా ఉండగా కనీస వేతనం రూ.22,900 చేయాలని, ఇదే కేటగిరీలో రూ. 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కనీస వేతనం రూ. 22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. గ్రూపు–3(ఏ) కేటగిరీలోని సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ స్టెనో, సీనియర్‌ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌/డీపీవోలకు ప్రస్తుతం రూ. 17,500 ఇస్తుండగా వారికి రూ. 31,040 కనీసం వేతనం ఇవ్వాలని సూచించారు.

ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉండగా… కనీస వేతనాన్ని రూ. 19 వేలుగా సూచించారు. జూనియర్‌ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 వుంది జూనియర్‌ లెక్చరర్లు ఉండగా రూ. 37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ. 54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ. 40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ. 58,850 కనీస వేతనంగా చేయాలని సిఫారసు చేసింది.
ఈ సిఫారసులను అమలు చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకుని, శనివారం రాత్రి ఆమోదం తెలిపారు.

హెచ్​ఆర్​ఏ తగ్గనుంది

హెచ్ఆర్ఏ స్లాబులను 11,13,17,24 శాతంగా పీఆర్సీ నిర్ణయించింది. మెట్రో నగరాల్లో హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి కుదించడాన్ని తప్పు పడుతున్నారు. ప్రస్తుతం హెచ్​ఆర్​ఏ శ్లాబులు 11, 13, 17,24గా నిర్ణయించగా… గతంలో 12,14,20,30 శాతంగా శ్లాబులు ఉన్నాయి.

ఈ సందర్భంగా టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్​, టీజీఓ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, టీజీఓ ప్రతినిధులు రవీంద్ర కుమార్​, రవీందర్​రావు, సామల సహదేవ్​, గండూరి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణ యాదవ్​, లక్ష్మణ్​గౌడ్​, టీటీయూ అధ్యక్షుడు మణిపాల్​రెడ్డి, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్​రెడ్డి తదితరులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story