రైతు వేదిక నా కల : సీఎం కేసీఆర్

by  |
రైతు వేదిక నా కల : సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో ముందడుగు వేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికను ఘనంగా ప్రారంభించారు. శనివారం జనగామ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కొడకండ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించనున్నారు. అనంతరం రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా రైతుల కోసం వేదికలు లేవు అని అన్నారు. కొడకండల్లో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రైతు వేదికలో రెండు గదులు, విశాలమైన హాలు ఉంటుందని వెల్లడించారు. రైతులు ఒకచోట కూర్చొని చర్చించుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో ఇది ఒక సరికొత్త అధ్యాయం అని, దీంతో కేంద్రం కళ్లు తెరిపించాలని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఎఫ్‌సీఐ ఆదేశాలు జారీ చేసిందని, దాంతో రైతులకు మద్దతు ధర ఇవ్వనీయకుండా అడ్డుకుంటూ, ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. రైతుల వద్ద నుంచి స్వయంగా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. కరోనా మహమ్మారి పీడ ఇంకా ఉందని, అందరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

మార్కెట్‌లో తగిన ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెకెండ్ వేవ్ ప్రమాదం ఉందని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలు నిర్మించామని అన్నారు. ఇప్పటికే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం పూర్తి అయ్యాయని వెల్లడించారు. రైతు వేదికల నిర్మాణం నా కల అని అన్నారు. రైతుల ధాన్యానికి మంచి ధర వచ్చేలా కృషి చేస్తానని వెల్లడించారు. ఈ వేదికల ద్వారా రైతుల్లో ఐక్యత నెలకొంటుందని తెలిపారు. ఏ పంట వేసుకోవాలో రైతులే వేదికల్లో కూర్చొని నిర్ణయించుకునే రోజులు రావాలని అన్నారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతుల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు కనుకే, రైతుల కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నామని తెలిపారు. రైతుల కోసం అనేక చర్యలు తీసుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి అని అన్నారు. కేవలం రైతుల కోసమే 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ వేదికలు రైతులను సంఘటిత శక్తిగా మారుస్తాయని వెల్లడించారు. రైతులంతా ఒక పిడికిలిగా మారాలని అన్నారు. మధ్య దళారీల నివారణకు రైతు వేదికలు ఉపయోగపడుతాయని తెలిపారు. గతంలో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే విధంగా రైతుల పరిస్థితి ఉండేదన్నారు. త్వరలోనే భూ సమగ్ర సర్వే కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. సంకల్పం గట్టిగా ఉంటే రైతు రాజ్యం వచ్చి తీరుతుంది అన్నారు.

కరోనా వచ్చిన దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన సమయంలో అన్ని ఆపినా… వ్యవసాయం అపొద్దని తాను ప్రధాని మోడీకి చెప్పినట్టు గుర్తు చేశారు. భారతదేశానికి ప్రమాదం వచ్చి, రైతు అలిగితే మనకు తిండి దొరకదు అని ప్రధానితో అన్నటట్టు తెలియజేశారు. తెలంగాణ వచ్చాక రైతులు బాగుపడ్డారని అన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని చంపేసాయని, తెలంగాణ వచ్చాక వ్యవసాయాన్ని పండుగ జేసే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు. ఎంతో ముందుచూపుతో యాదవులకు గొర్రెలకు పంపిణీ చేస్తున్నామని, అది కేసీఆర్ బతికి ఉన్నంతకాలం ఇస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటు చేస్తామని కలలో కూడా అనుకోలేదని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా మంచినీరు అందిస్తున్నాని వెల్లడించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చురుగ్గా జరుగడం వల్ల, రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధిని నివారించగలిగామన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో రూ.50 వేల కోట్లు నష్టపోయామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఆయన పొలాన్ని ఆయనే తగులబెట్టుకొని, నష్టపోయిన ఆదుకోవాలని దొంగనాటకాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నాయకులు దొంగ మాటలు చెబుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed