నీళ్లకు.. ఇక ఒకే శాఖ

by  |
నీళ్లకు.. ఇక ఒకే శాఖ
X

దిశ, న్యూస్‌బ్యూరో: జలవనరుల శాఖ ఒక్కటిగా మారుస్తున్నామని, ఇకనుంచి సీఈలు బాధ్యులుగా ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జల వనరుల శాఖ పునర్ వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని సాగునీటి వసతులు పెరిగాయని, ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నామని, గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జల వనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలుంటే, వాటి సంఖ్యను 19కి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హైజులు, కాలువలు, సబ్‌స్టేషన్లు అన్ని సీఈ పరిధి కిందికే రానున్నాయి. గతంలో భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడీసీ వంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటిపారుదల శాఖ ఇకపై కేవలం జలవనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుందని నిర్ణయించారు.

మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పాకాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ కాకతీయులు నిర్మించిన పాకాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అన్నారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటల, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, సీఎం ఒఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు.

Next Story

Most Viewed