గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

by  |
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం, వైద్యారోగ్య సిబ్బంది సన్నద్ధత తదితర అంశాలను చర్చించినట్లు తెలిసింది. హైదరాబాద్ నగర పరిధిలో ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసుల్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు, ర్యాపిడ్ టెస్టుల్ని పెంచడం ద్వారా ప్రాథమిక దశలోనే కరోనా వైరస్ బారినపడినవారిని గుర్తించడం, జిల్లా కేంద్రాల్లోనూ టెస్టుల్ని నిర్వహించడం తదితరాలన్నింటిపైనా గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది.

సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన ఆదేశం, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, నూతన సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వ అభిప్రాయం తదితరాలను కూడా ఆమెతో చర్చించినట్లు తెలిసింది. సాగునీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణ, వ్యవసాయ రంగంలో తీసుకున్న చర్యల ద్వారా ఈసారి పెరుగుతున్న సాగు విస్తీర్ణం తదితరాలపై కూడా గవర్నర్ సమావేశంలో వివరించినట్లు తెలిసింది. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల అంశం చర్చకు రాలేదని పార్టీ వర్గాల సమాచారం.

Next Story

Most Viewed