సీఎంగా కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలూ ఫేక్ : బండి

by  |
Bandi sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలూ ఫేక్.. అంబేద్కర్ జయంతిని గౌరవించని సీఎం.. దళితుల మీద ఫేక్ ప్రేమ చూపిస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజల స్పందన, బీజేపీ ఆదరణ చూసిన తరువాత ఆందోళన చెందిన సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకు వచ్చాడని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దిగజారాడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఎద్దేవా చేశారు.

కేసీఆర్… ఫేక్ ఐడీ కార్డులు, తప్పుడు ప్రచారాలు చేసే స్థాయికి దిగజారాడని, కోట్ల రూపాయలు కుమ్మరించి ఎలాగైనా హుజూరాబాద్ ఎన్నికలలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈటెల రాజేందర్ బావమరిది పేరిట ఫేక్ ఐడీలతో తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎదుర్కోవాలని సవాల్ చేశారు. అక్రమ పద్ధతిలో ఉపఎన్నికను గెలవాలని చూడటం సిగ్గుచేటన్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి బంపర్ ఆఫర్లతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు కేసీఆర్ వ్యవహారాల శైలిని ఛీదరించుకుంటున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ధిని మతకోణంలో చూస్తున్నారని, హిందువులు నివసించే ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చి వేతలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాతబస్తీలో పన్నులు కట్టకపోయినా, రోడ్లు ఇరుకుగా ఉన్నా అక్కడ కూల్చివేతలకు పాల్పడే ధైర్యం కేసీఆర్‌కు లేదని, ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరో న్యాయం ఉండకూడదని ప్రజాస్వామ్యంలో ఒకటే ఉండాలన్నారు. పాతబస్తీ అభివృద్ధిని టీఆర్ఎస్, ఎంఐఎం అడ్డుకుంటున్నాయని విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి ధైర్యం ఉంటే పాతబస్తీలో రోడ్ల వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీది గాంధీ భవన్ కాదు.. ప్రగతి భవన్

కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి కాదు.. ప్రగతి భవన్ నుంచి నడుస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నడుపుతున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ టికెట్లు కూడా ఆయనే ఇస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ధర్నాలకు ముందస్తు అనుమతులు ఇస్తున్నారు… వారి ధర్నాలు విజయవంతం చేస్తారని ఆరోపించారు. బీజేపీ ధర్నాలకు అనుమతి ఇవ్వాలని కోరినా పట్టించుకోరని మండిపడ్డారు. ప్రగతి భవన్ ముట్టడి పేరుతో బీజేపీ కార్యకర్తలను తెలంగాణ వ్యాప్తంగా అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని అరెస్టులు చేసినా నేడు చేపట్టే ధర్నా కొనసాగుతుందని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed