ఫాంహౌస్ నుంచే కేసీఆర్ ఫోకస్.. అంతా ఫోన్లతోనే..

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న మినీమున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీల్లో విజయం సాధించేలా ఎన్నికల ఇన్‌చార్జులు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో నిత్యం ఫోన్‌లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎలా విజయం సాధించాలి… రెబెల్స్‌ను ఎలా దారికి తెచ్చుకోవాలి.. ప్రచారం నిర్వహణపై సూచనలు చేస్తున్నారు. ప్రతి రోజు నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. ప్రచారం నేటితో ముగుస్తుండగా… ఎన్నికల పోలింగ్ నాలుగో రోజు జరుగనుంది. ఈ రెండు రోజుల గడువులోగానే టీఆర్ఎస్ రెబల్స్‌ను దారికి తెచ్చుకునేందుకు టీఆర్ఎస్ ఎన్నికల ఇన్‌చార్జులతో పాటు సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనుండగా, రెబల్స్ బరిలో నిలిచారు. టికెట్ రాని వారు పార్వర్డ్ బ్లాక్ నుంచి టికెట్ తెచ్చుకొని, కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ప్రతిపక్షాల కంటే వీరితోనే కొన్ని వార్డుల్లో గట్టి పోటీ ఉంది. అయితే ఈ విషయం పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో వారిని దారిలోకి తీసుకొచ్చేందుకు ఫోన్ లో పలు సూచనలు చేస్తున్నారు. దారికి రాకపోతే చేపట్టబోయే చర్యలను వివరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఒక వేళా టీఆర్ఎస్ పట్టు నిలుపుకోకపోతే రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దానిని చెక్ పెట్టేందుకు రెబల్స్‌ను దారికి తీసుకొచ్చేందుకు నేతలు ముమ్మర యత్నాలను మరోసారి ప్రారంభించారు.

కేటీఆర్ రోడ్డు షోలకు బ్రేక్

ఈనెల 30న వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రోడ్ షో‌లు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ భావించారు. అందుకు తగిన ఏర్పాట్లు సైతం ప్రారంభించారు. అయితే ఆయనకు కరోనా రావడంతో వాయిదా పడింది. ఒక వైపు కరోనా చికిత్స చేయించుకుంటూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించేలా చర్యలను వివరిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట తీసుకోవాల్సిన చర్యలపై ఫోన్‌లో నేతలకు వివరిస్తున్నారు.

Next Story

Most Viewed