ఈ నెల 31 వరకే ధాన్యం సేకరణ : సీఎం కేసీఆర్

by  |
ఈ నెల 31 వరకే ధాన్యం సేకరణ : సీఎం కేసీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రస్తుతం కొనసాగుతున్న వరి ధాన్యాల కొనుగోళ్లు ఈ నెల 31 వరకు మాత్రమే జరుగుతాయని, ఆ మరుసటి రోజు నుంచి కొనుగోలు కేంద్రాలు మూతబడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు కూడా ఈ లోపునే ధాన్యాన్ని అమ్ముకోవాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితులు వర్షాకాలం పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకూ సుమారు 86% మేర ధాన్యం కొనుగోళ్ళు జరిగినట్టు పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. మరో ఐదు రోజుల్లో మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని భావిస్తోంది.

వానాకాలం పంటల సాగులో భాగంగా నియంత్రిత పద్ధతిలో ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో అధికారులు రైతులకు వెంటనే తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఆయా పంటలకు అవసరమైన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వానాకాలంలో పంటల సాగు, విత్తనాలు – ఎరువుల లభ్యత, పంటల కొనుగోళ్లు తదితర అనేక అంశాలపై సీఎం సమీక్ష జరిపారు.

మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని రైతులకు ప్రభుత్వం సూచించినా.. గతేడాది వర్షాకాలం వేసిన పంటలతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవన్నారు. ఈ వర్షాకాలంలో మక్కలు మాత్రమే మాత్రమే చెప్పామని, దానికి బదులుగా కందులు లేదా పత్తి వేయమని కోరినట్టు వివరించారు. గతేడాది వర్షాకాలంలో సాగుచేసినట్టుగానే ఈసారి కూడా 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని, అయితే మార్కెట్లో డిమాండ్ కలిగిన వరి వంగడాలను ప్రభుత్వం సూచించిన ప్రకారం వేయాల్సిందిగా సూచించారు. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుచేస్తే ఈసారి మరో 15 లక్షలు పెంచాలని తెలిపారు. మిగిలిన పంటల విషయంలో మార్పులు సూచించలేదని, రైతులు కూడా సంపూర్ణంగా సహకరించడానికి ముందుకొస్తున్నారని గుర్తుచేశారు.

ఏ క్లస్టర్‌లో ఏ పంట వేయాలనే విషయంలో నిర్ణయం జరిగింది కనుక ఈ నిర్ణయాలను రైతులకు చేరవేయాలని, ఇందుకోసం జిల్లాలవారీగా తయారు చేసిన ప్రణాళికను వెంటనే పంపాలని స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో అధికారులు సమావేశం కావాలని, మండల వ్యవసాయాధికారులకు క్లస్టర్ల వారీగా రూపొందిన ప్రణాళికను ఇవ్వాలని సూచించారు. ఆ మరుసటి రోజు మండలాల్లో వ్యవసాయ విస్తరణాధికారుల సమావేశాన్ని నిర్వహించి క్లస్టర్ల వారీగా ఏ పంట ఎంత వేయాలో వివరించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏఈవో (వ్యవసాయ విస్తరాణాధికారులు) రైతులకు వివరించాలని చెప్పారు. సూచించిన ప్రకారం పంటలు వేసే విధంగా రైతులను సమన్వయ పరచాలన్నారు. కల్తీ, నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిఘా పెంచాలని, అమ్ముతున్నట్టు తెలిస్తే, వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు.


Next Story