యార్లగడ్డ, వంశీ చేతులు కలిపిన జగన్

by  |
యార్లగడ్డ, వంశీ చేతులు కలిపిన జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పాలిటిక్స్‌లో గరంగరంగా ఉన్న గన్నవరం నియోజకవర్గ వైసీపీ పంచాయతీని సీఎం జగన్మోహన్‌రెడ్డి కాస్తంతా తగ్గించే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గర కావడంతో గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న యార్లగడ్డకు నచ్చలేదు. ఇదే క్రమంలో ఇరువర్గాల కార్యకర్తలు బహిరంగంగానే తిట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీలపై కాస్తంత అసంతృప్తిగా ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. సరిగ్గా టైమ్‌ చూసి సెట్ చేసేందుకు ప్రయత్నించారు.

గురువారం ఉదయం ‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం జగన్‌కు కృష్ణా జిల్లా నేతలు స్వాగతం పలికారు. ఆ సందర్భంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ పక్క పక్కనే ఉన్నారు. వారితో కరాచాలనం చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.. యార్లగడ్డ చేయిని తీసి వంశీ చేతిలో పెట్టారు. అయితే ఈ సమయంలో యార్లగడ్డ ఎలాంటి ఆసక్తి కనబర్చలేదు. ఎదో చెప్పబోతుండగా.. కలిసి పని చేసుకోవాలని జగన్ స్పష్టం చేశారు. మళ్లీ కలిపించుకొని యార్లగడ్డ ఏదో చెప్పబోతుండగా ఆప్యాయంగా యార్లగడ్డను పట్టుకొని కలిసి పనిచేసుకోండని మరోసారి చెప్పారు. ఇదంతా గమనించిన వల్లభనేని వంశీ.. అలాగే చూస్తుండి పోయారు.

ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, దుట్టా, యార్లగడ్డ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా ఉంది. ఒక వర్గానికి చెందిన వారికి మరోవర్గం వారు కనపడితే తిట్ల పురాణాలే కనపడుతున్నాయి. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ, యార్లగడ్డ మధ్య సయోధ్యకు జగన్ ప్రయత్నించారు. అయితే రేపటి నుంచి నియోజకవర్గంలో ఈ నేతలు ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story

Most Viewed