చీరాల ఘటనపై సీఎం సీరియస్.. రూ.10 లక్షల పరిహారం ప్రకటన

by  |
చీరాల ఘటనపై సీఎం సీరియస్.. రూ.10 లక్షల పరిహారం ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ :
ఏపీలో కిరణ్ అనే దళిత యువకుడిపై మూడు రోజుల కిందట చీరాల ఎస్సై విజయ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కిరణ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 19వ తేదీన తన స్నేహితులతో కలిసి కిరణ్ బైక్ పై బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఎస్సై వారిని ఆపి మాస్క్ ధరించకపోవడంతో దాడి చేశాడు. ఈ దాడిలో కిరణ్ స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత అతన్ని చీరాల ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి కాస్త విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి … అక్కడి నుంచి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న కిరణ్ బుధవారం ఉదయం ప్రాణాలు వదిలాడు. మృతుని మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఎస్సై విజయ్ కుమార్ పై హత్యకేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story