కోటిచ్చాడు.. చోటివ్వలేకపోయాడు

by  |
కోటిచ్చాడు.. చోటివ్వలేకపోయాడు
X

విశాఖపట్టణంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ. కోటి పరిహారమిస్తామని ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన బాధితులకు కనీసం చోటివ్వలేకపోయాడు. మూడు రోజులుగా ఎల్జీ పాలిమర్స్ కేంద్రంగా చోటుచేసుకున్న ఘటనలు వైజాగ్ పరిధిలోని ఐదు గ్రామాలతోపాటు కంపెనీకి 15 కిలోమీటర్ల ప్రజలకు కాళ రాత్రులుగా మారి నిద్రలేని రాత్రులయ్యాయి.

గురువారం వేకువజామున వెంకటాపురం, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, పద్మనాభపురం, నందమూరినగర్ వాసులు మంచం మీద నుంచి నిద్రలేవనే లేదు. భరించలేని వాసన, లేచి చూసేసరికి ప్రాణాంతకమైన, పీల్చేందుకు భారమైన ఊపిరితిత్తులను మెలిపెట్టే గాలి, కళ్లు తెరిస్తే మంటలు, శరీరమంతా దురద ఏదో జరుగుతుందని తేరుకుని పరుగుతీసేలోపు శరీరాన్ని కమ్మేసిన నిస్సత్తువ, వాంతులు చేసుకుంటూ నెలకొరిగిన జనాలు, పోలీసులు, చుట్టుపక్కల యువత, ఎన్టీఆర్ఆఫ్ దళాల చొరవతో వందలాది మంది రక్షించబడ్డారు. లేకుంటే ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లోని ఐదు కిలోమీటర్ల దూరం శ్మశానంగా మారి, దేశంలోనే అతిపెద్ద దారుణంగా మారేది. ఘటన అనంతరం ఆ పరిసరాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. బతికుంటే బలుసాకు తినొచ్చని ప్రాణభయంతో పరుగులు తీసిన వారు ఇళ్ల తాళాలు కూడా వేయకుండా పరారయ్యారు.

సహాయక చర్యలు సాయంత్రానికి కొలిక్కి వచ్చాయి. ప్రమాదం లేదు, అంతా సేఫ్ అని ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీంతో అంతా నిద్రకి ఉపక్రమిస్తున్నారు. అప్పటికే అప్‌డేట్స్ కోసం రాత్రి 10:30 ప్రాంతంలో ఫోన్ వైపు చూస్తున్న వారిపై పిడుగు పడ్డట్టుగా వాట్స్ యాప్‌లో ఎల్జీ పాలిమర్స్‌లో మరో లీక్.. ట్యాంకు పేలిపోయే అవకాశం. 15 కిలోమీటర్ల దూరం వరకు ప్రభావం అంటూ మెసేజ్ కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ కంపెనీకి 15 నుంచి 20 కిలో మీటర్ల దూరంలోని సుమారు 2 నుంచి 3 లక్షల మంది అందినకాడికి సర్దుకుని రోడ్డెక్కారు. గమ్యం లేని ప్రయాణం… బంధువులు, తెలిసిన వారింటికి వెళ్దామంటే.. వారంతా నిష్కర్షగా కరోనా భయంలో రావద్దని చెప్పేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ఎంతో మంది నడిరోడ్డు మీద, బీచ్‌లోని ఇసుకలో నిద్రపోయేందుకు ఉపక్రమించారు.

గ్యాస్ లీక్ ఘటన బాధితులకు రూ. కోటి పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి కానీ, వైజాగ్ పర్యటనలో సీఎం వెంట ఉన్న మంత్రులు కాని స్పందించలేదు. వారందరికీ ఒక ఆసరా కల్పించలేదు. ఎంతసేపు బాధితులను ఆదుకున్నమన్న మాటే తప్ప.. ఇలాంటి ఉత్పాతానికి స్పందించే వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇదే సమయంలో పలువురు కార్లు, బైకుల్లో 50 కిలోమీటర్ల దూరంలో విజయనగరం వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారిని సరిహద్దుల్లో అడ్డుకున్న పోలీసులు ఎంత ప్రాధేయపడినా వదలలేదు. క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి మళ్లారు.

దీంతో ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రూ. కోటి పరిహారమిచ్చామని ప్రచారం చేసుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు తప్ప బాధితులను ఎలా ఆదుకోవాలి? వారికి ఎలా ఆశ్రయం కల్పించాలి? అన్న ఆలోచన చేయలేదని స్థానికులు మండిపడ్డారు. ఉదయం ప్రమాదమేమీ లేదన్న ప్రకటన వచ్చిన తరువాతే వారంతా తిరుగుముఖం పట్టడం విశేషం. అధికారులు చర్యలు తీసుకుని పునరావాసం కల్పించి ఉంటే వసతి గృహాలు, కళాశాలలు, స్కూళ్లు, కల్యాణమండపాలు ఇలా చాలా ఉన్నాయి. అధికారులు ఆ దిశగా ఆలోచించలేదు. రాజకీయ నాయకులు విమర్శలకు సమాధానాలివ్వడమే తప్ప ప్రజల అవసరాలు తీర్చేందుకు ఒక్క నాయకుడు కూడా కదలకపోవడం విశేషం?



Next Story